తెలంగాణ ఇచ్చినప్పటికీ రెండు సార్లు అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు పవర్లోకి రావడం వెనుక ఆ పార్టీ నేతల సమిష్టి కృషితోపాటు పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి అనుసరించిన వ్యూహాలు కీలకంగా మారాయి. కురు వృద్ధ కాంగ్రెస్ను గెలుపు తీరానికి చేర్చిన యువ నేతగా ఆయనకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్ షోలతో రాష్ట్రమంతా రేవంత్ కలియతిరిగి.. పార్టీకి విజయం అందించారు. కాంగ్రెస్లో అతి తక్కువ కాలంలో ఈ స్థాయికి ఎదిగిన నాయకుడు ఎవరూ లేరు. పార్టీలో ఒక పదవి దక్కాలంటే దశాబ్దాల పాటు శ్రమిస్తే తప్ప కల సాకారం కాదు. కానీ, రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన రెండేండ్లకే ఆయన పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు.
2006లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి
రేవంత్రెడ్డి.. 2006లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. అదే ఏడాది మిడ్జిల్ మండలం నుంచి జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. 2007లో ఉమ్మడి రాష్ట్రంలో శాసన మండలి ఎన్నికల్లో స్థానిక సంస్థల కోటా కింద స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగి విజయం సాధించారు. తర్వాత టీడీపీలో చేరిన ఆయన.. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2014లో రెండో దఫా పోటీ చేసి సక్సెస్ అయ్యారు. 2017 వరకు టీడీపీకి ఫ్లోర్ లీడర్గా వ్యవహరించారు. అదే ఏడాది అక్టోబర్లో ఆ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరారు.
కాంగ్రెస్లో అంచెలంచెలుగా ఎదుగుతూ
రేవంత్రెడ్డి కాంగ్రెస్లో అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. 2018లో పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా పదవి పొందారు. అదే ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కొడంగల్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత కొద్ది నెలలకు 2019లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి స్థానం నుంచి బరిలోకి దిగి విజయం సాధించారు. 2021, జూన్ 26న ఆయనను పీసీసీ చీఫ్గా నియమిస్తూ ఏఐసీసీ ఆదేశాలు జారీ చేసింది. అదే ఏడాది జులై 7న రేవంత్ పీసీసీ చీఫ్గా ప్రమాణం చేశారు. అప్పటి నుంచి ఆయన రాష్ట్రంలో కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకురావాలని తీవ్ర ప్రయత్నాలు సాగించారు.
పార్టీలోని అందరినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు శ్రమించారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని కొందరు ముఖ్య నేతలకే నమ్మకం లేని స్థితి నుంచి రాష్ట్రమంతా ‘మార్పు కావాలి–కాంగ్రెస్ రావాలి’ అనే నినాదంతో రేవంత్ ముందుకు కదిలారు. పార్టీలోని చాలా మంది ముఖ్య నేతలు, స్టార్ క్యాంపెయినర్లు తమ తమ నియోజకవర్గాలకే పరిమితమై ప్రచారం సాగించగా రేవంత్ మాత్రం రాష్ట్రమంతా కలియదిరుగుతూ అభ్యర్థులకు అండగా ఉంటూ వచ్చారు. అధికార పార్టీ బీఆర్ఎస్పై ఘాటు విమర్శలు కురిపిస్తూ.. తొమ్మిదిన్నరేండ్ల పాలనలోని తప్పులను వేలెత్తి చూపిస్తూ.. జన చైతన్యాన్ని రగిలించారు. అతడే ఒక సైన్యమై కాంగ్రెస్ను విజయ తీరానికి చేర్చగలిగారు