- మోటార్లకు మీటర్లు పెడితే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం
- మేం పెట్టకుంటే బీఆర్ఎస్ తప్పుకుంటదా? .. సీఎం రేవంత్ రెడ్డి సవాల్
- ఉచిత విద్యుత్ ఎత్తేస్తామన్నది పచ్చి అబద్ధం
- స్మార్ట్ మీటర్లకు పునాది వేసిందే బీఆర్ఎస్.. 2017లోనే త్రైపాక్షిక ఒప్పందం
- అకౌంటబిలిటీ కోసమే తొలిసారిగా ‘రైతు డిస్కం’
- సబ్సిడీలను ప్రతినెలా ఒకటో తేదీనే రిలీజ్ చేస్తం
- కేంద్రం వడ్లు తీసుకోకపోతే బీఆర్ఎస్, బీజేపీ నేతల ఇండ్ల ముందే కుమ్మరిస్తం
- రైతు ముసుగులో రాజకీయం చేస్తున్నరు..
- వారి డీఎన్ఏలోనే మోసం, అబద్ధాలు
- కేసీఆర్ మీద ఒట్టు వేసి బీఆర్ఎస్లోనే
- ఉంటానని హరీశ్రావు చెప్పగలరా?
- గ్లోబరీనా కేటీఆర్ బినామీ సంస్థే
- తుమ్మిడిహెట్టి పై మహారాష్ట్ర సీఎం అపాయింట్మెంట్ ఇవ్వలే
- ఎన్టీఆర్ విగ్రహంపై మాట్లాడుతున్నోళ్లు..
- కేటీఆర్ పేరు మార్చుతరా?
- మహేశ్కుమార్గౌడ్ పీసీసీ చీఫ్గా..
- తాను సీఎంగా 2029 ఎన్నికలకు వెళ్తామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: ‘‘ఒకవేళ మా ప్రభుత్వం వ్యవసాయ మోటర్లకు స్మార్ట్ మీటర్లు పెడితే, 24 గంటల ఉచిత విద్యుత్ రద్దు చేస్తే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం.. ప్రజలను ఓట్లు అడగం.. ఒకవేళ మేం మీటర్లు పెట్టకపోతే ఇప్పుడు అబద్ధాలు ఆడుతున్న బీఆర్ఎస్ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుకుంటుందా? ముక్కు నేలకు రాసి తెలంగాణ సమాజానికి క్షమాపణ చెబుతుందా?’’ అని సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్రంలో ఉచిత విద్యుత్తును రద్దు చేసి, మోటార్లకు మీటర్లు పెడుతున్నారంటూ బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. శనివారం హైదరాబాద్ ఎంసీహెచ్ఆర్డీలోని బోధి పెవిలియన్లో సీఎం రేవంత్రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశారు. అసలు తెలంగాణలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు పునాది వేసి, డిస్కంలను రూ. 69,741 కోట్ల నష్టాల్లోకి నెట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని విమర్శించారు.
రాజకీయ లబ్ధి కోసమే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ రైతుల ముసుగులో లైఫ్ లైన్ కోసం ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. దేశంలోనే తొలిసారిగా రైతుల కోసం ప్రత్యేకంగా ‘రైతు డిస్కం’ ఏర్పాటు చేశామని, దీనివల్ల ప్రభుత్వానికి తక్కువ ధరకే విద్యుత్ కొనుగోలు చేసే వెసులుబాటుతోపాటు జవాబుదారీతనం పెరుగుతుందని స్పష్టం చేశారు. వ్యవసాయ ఉచిత విద్యుత్, లిఫ్ట్ ఇరిగేషన్, ప్రభుత్వానికి సంబంధించిన ఇతర సబ్సిడీలను ప్రతినెలా ఒకటో తేదీనే రైతు డిస్కంకు చెల్లిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణలో ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్ల ద్వారా విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరిస్తున్నారంటూ బీఆర్ఎస్ లీడర్లు చేస్తున్న ఆరోపణలు పచ్చి అబద్ధాలని సీఎం రేవంత్రెడ్డి మండిపడ్డారు. ‘‘రాష్ట్రంలో స్మార్ట్ మీటర్ల ఏర్పాటుకు పునాది వేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని నేను స్పష్టంగా చెప్తున్నా. 2017 జనవరి 4న అప్పటి రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు), కేంద్ర ఇంధన శాఖ మధ్య త్రైపాక్షిక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ప్రకారం 2017 జూన్ 30 నాటికి అన్ని డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లు, ఫీడర్లకు మీటరింగ్ పూర్తి చేస్తామని అంగీకరించారు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అప్పటి ఎనర్జీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ మిశ్రా, ఎస్పీడీసీఎల్ జి. రఘుమారెడ్డి, ఎన్పీడీసీఎల్ గోపాల్ రావు సంతకాలు చేశారు. అంటే కేంద్రం, తెలంగాణ ప్రభుత్వం, రాష్ట్ర డిస్కంల అంగీకారంతోనే ఈ ఒప్పందం జరిగింది”అని తెలిపారు.
500 యూనిట్లపైన విద్యుత్ వినియోగించే వినియోగదారులకు 2018 నాటికి, 200.. అంతకంటే ఎక్కువ యూనిట్లు వాడే వారికి 2019 నాటికి స్మార్ట్ మీటర్లు ఏర్పాటు చేస్తామని అధికారికంగా అదే రోజు ఒప్పందాల్లో సంతకాలు చేశారని సీఎం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆర్డీఎస్ఎస్ పథకంపై బీఆర్ఎస్ నేతలు డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఆర్డీఎస్ఎస్ అనేది 2021లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన పథకమని, దీని ప్రధాన ఉద్దేశం విద్యుత్ పంపిణీ సంస్థలను ఆర్థికంగా బలోపేతం చేయడం, విద్యుత్ నాణ్యతను మెరుగుపరచడం, అగ్రిగేట్ టెక్నికల్ అండ్ కమర్షియల్ నష్టాలను తగ్గించడమని ఆయన వివరించారు. ఇది 2025-–26 వరకు అమలయ్యే పథకమని, ఇటీవల మరో రెండేండ్లు పొడిగించారని తెలిపారు. ‘‘ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2022 ఏప్రిల్ 4న సుమారు రూ. 9,308 కోట్ల అంచనాతో స్మార్ట్ మీటరింగ్కు సంబంధించిన డీపీఆర్, యాక్షన్ ప్లాన్ సమర్పించిందని చెప్పారు. ఆర్డీఎస్ఎస్లో భాగస్వామ్యం కావడం కొత్త విషయమేమీ కాదు, ఆనాటి ప్రభుత్వం తీసుకున్న అధికారిక నిర్ణయమే ఇది”అని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.
అంతేకాకుండా, ఆర్డీఎస్ఎస్ రాకముందు 2017–-18లో ఐడీపీఎస్ పథకం కింద ప్రభుత్వ కార్యాలయాల్లో 29,632 స్మార్ట్ మీటర్లను అమర్చారని, అది కూడా బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. తప్పుడు నిర్ణయాలు వారు తీసుకొని, ఆ నెపం తమ ప్రభుత్వంపై మోపడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఉదయంపూట కరెంట్ వినియోగం తక్కువగా ఉంటుందని, ప్రతి 15 నిమిషాలకోసారి జరిగే కరెంట్ కొనుగోళ్లలో తక్కువ ధరకే తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. కొన్నిసార్లు ఉచితంగా కూడా దొరుకుతుందని చెప్పారు. అందులో భాగంగానే రైతులు ఉదయం సమయంలోనే ఎక్కువ కరెంట్ వినియోగించుకునేలా రైతు డిస్కంలో చర్యలు తీసుకుంటామన్నారు.
రైతు డిస్కం.. డెడికేటెడ్ డిస్కం
రైతు డిస్కంపై లేనిపోని అపోహలు సృష్టిస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన 100 శాతం ప్రభుత్వ రంగ సంస్థ అని, తెలంగాణలో ఇది మూడో డిస్కం అవుతుందని తెలిపారు. ఇది పూర్తిగా రైతులకు, అంటే వ్యవసాయ వినియోగదారులు, ఇతర సబ్సిడీ ప్రాధాన్య వర్గాలకు ప్రత్యేకంగా సేవలు అందిస్తుందని, అందుకే దీనిని ‘డెడికేటెడ్ డిస్కం’ లేదా ‘రైతు డిస్కం’ అని పిలుస్తున్నామని వివరించారు. రైతు డిస్కం ద్వారా మీటర్లు పెడతారనేది పచ్చి అబద్ధమని, ఇది పూర్తిగా రైతుల విద్యుత్ సేవల నాణ్యతను మెరుగుపరిచే సంస్కరణ అని
