
హైదరాబాద్, వెలుగు: బహుళ అంతస్తుల భవనాలు, ఇతర నిర్మాణాలకు అనుమతులు జారీ చేయడంలో జాప్యంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎండీఏ పరిధిలో ‘బిల్డ్ నౌ’ కింద పనుల అనుమతుల విషయమై అధికారులతో సీఎం సోమవారం సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ బహుళ అంతస్తుల భవనాలు, గేటెడ్ కమ్యూనిటీల నిర్మాణం, ఇతర అనుమతుల విషయంలో కొందరు అధికారులు కావాలనే అలసత్వం చూపుతున్నారని మండిపడ్డారు. ఈ జాప్యానికి కారణమైన వారిని గుర్తించి సరెండర్ చేయాలని హెచ్ఎండీఏ కార్యదర్శి ఇలంబర్తిని సీఎం ఆదేశించారు.
ముఖ్యంగా నీటిపారుదల శాఖ విభాగం అధికారులపై అనేక ఆరోపణలు వస్తున్నాయని, వాటిని ఎంతమాత్రం సహించేది లేదని హెచ్చరించారు. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువులు, నాలాలు, ఇతర నీటి వనరులకు సంబంధించి లైడార్ సర్వేను తక్షణమే చేపట్టాలని సీఎం ఆదేశించారు. సమగ్ర వివరాలు ఉన్నప్పుడు మాత్రమే ఎటువంటి వివాదాలకు తావుండదని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయంలో జీహెచ్ఎంసీ, హైడ్రా, ఇరిగేషన్ అధికారులతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ త్వరగా అనుమతులు మంజూరు చేయాలని హెచ్ఎండీఏ కార్యదర్శిని సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి. కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తదితరులు పాల్గొన్నారు.