- ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్
నక్కలగుట్ట, వెలుగు: ఆధునిక సాంకేతికతతో విద్యుత్ సేవల్లో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నామని ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిట్టల్ తెలిపారు. హైదరాబాద్ నుంచి శుక్రవారం సీఎండీ కర్నాటి వరుణ్ రెడ్డి, డైరెక్టర్లు, చీఫ్ ఇంజనీర్లు, చీఫ్ జనరల్ మేనేజర్లతో వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు.
సబ్ స్టేషన్ పరిధిలో సోలార్ ప్లాంట్ పెట్టడం వల్ల ట్రాన్స్మిషన్, డిస్ట్రిబ్యూషన్ నష్టాలు తగ్గుతాయని తెలిపారు. అంతకుముందు ఎన్పీడీసీఎల్ సీఎండీ పలు ప్రపోజల్స్ ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఫీల్డ్ వర్క్ లాగింగ్ యాప్ ప్రవేశపెట్టాలని నిర్ణయించామని చెప్పారు.
క్షేత్రస్థాయిలో పని చేసే సిబ్బంది పనితీరును డిజిటల్ గా నమోదు చేసేందుకు ‘ఫీల్డ్ వర్క్ లాగింగ్ యాప్’ అభివృద్ధి చేస్తున్నట్లు వివరించారు. ఈ యాప్ ద్వారా లైన్మెన్లు, జేఎల్ఎంలు, ఏఈలు వాయిస్ ద్వారా పనుల వివరాలు నమోదు చేయవచ్చన్నారు. నమోదు చేసిన పనులను కేటగిరీ వారీగా విభజించవచ్చని చెప్పారు. పూర్తయిన పనులు, పెండింగ్ పనులు, ఫాలోఅప్ అవసరమైన పనులపై ఎప్పటికప్పుడు డ్యాష్ బోర్డ్ ద్వారా పూర్తి సమాచారాన్ని అందుబాటులో ఉంచే అవకాశం ఉందన్నారు.
సబ్ స్టేషన్ల సమీపంలో సౌర విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటు అంశాన్ని ప్రతిపాదించారు. ప్రభుత్వం, డిస్కమ్కు చెందిన భూములపై ప్రైవేట్ సంస్థల ద్వారా ప్లాంట్ల ఏర్పాటు ద్వారా ప్రయోజనాలను వివరించారు. అనంతరం 18 సర్కిళ్ల ఎస్ఈలతో సీఎండీ మాట్లాడారు.
వర్షాకాలంలో మెన్, మెటీరియల్ సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. సిబ్బంది హెడ్ క్వార్టర్ లోనే ఉండాలని, ఈదురుగాలులతో పోల్స్ పడిపోతే వెంటనే పునరుద్ధరణ పనులు చేపట్టాలని సూచించారు. డైరెక్టర్లు వి.మోహన్ రావు, వి.తిరుపతిరెడ్డి, టి.మధుసూదన్, సి.ప్రభాకర్, సీఈలు కె.తిరుమలరావు, కె.రాజు చౌహన్, అశోక్, మాధవ రావు పాల్గొన్నారు.
