అయ్యో..గింత సక్కని పొలం అంటుకుందే..! ఓ తల్లి ఆర్తనాదం

అయ్యో..గింత సక్కని పొలం  అంటుకుందే..! ఓ తల్లి ఆర్తనాదం

భూమిని నమ్ముకున్నారు. నేలతల్లి ఫుడ్డు పెడుతుందనుకున్నారు. రెక్కలు ముక్కలు చేసుకుని దుక్కి దున్ని…. నీరు కట్టి.. నారు పోస్తే.. చేతికొచ్చిన పంట… కళ్లముందే అగ్నికి ఆహుతైపోతుంటే దాన్ని పండించిన రైతు బాధ ఎంత హృదయవిదారకంగా ఉంటుందో ఊహించలేం. కన్నతల్లిలాంటి నేలపై.. కష్టపడి కంటిపాపల్లా పెంచుకున్న వరికంకులను బస్తాల్లోకి నింపే సమయంలో.. అనుకోని విపత్తు ఆ రైతులకు ఎదురైంది. 

ఈ సంఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం కాల్వచెర్ల గ్రామంలోని పొలాల్లో జరిగినట్టు తెలుస్తోంది. అగ్నిప్రమాదం కారణంగా.. వందల ఎకరాల్లోని వరిపంట తగలబడిపోయింది. అగ్నికి… ఎండిన వరిపంట ఆహుతైపోతున్నప్పుడు ఓ రైతు వీడియో తీశాడు. అందులో.. ఓ తల్లి అర్తనాదాలు హృదయాలు ద్రవింపచేస్తున్నాయి. అయ్యో.. గింత సక్కని పొలమే…  నా పొలమంతా అంటుకుందే.. నా కష్టం బుగ్గిపాలైందే .. అంటూ.. ఆమె గుండె బద్దలయ్యేలా ఏడ్చింది.

రైతు ఎంతో కష్టపడితేనే నాలుగు మెతుకులు జనానికి దొరుకుతున్నాయి. కానీ.. అలాంటి రైతు .. ఎండనకా.. వాననకా.. కాయ కష్టం చేసి.. పండించిన ధాన్యానికి గ్యారంటీ లేకుండా పోయింది. క్రాప్ ఇన్సూరెన్స్ ఇలాంటి సందర్భాల్లో రైతులకు బాగా ఉపయోగపడుతుంది. కానీ.. ఎంతమందికి దానిగురించి తెల్సు… అన్నదే ఓ పెద్ద సందేహం. 

 

వరిపొలాల్లో మంటలు.. అన్నదాత కన్నీళ్లు..