ఇంటి స్థలం కోసం పంత్ ట్వీట్: దేవభూమికి పేరు తెచ్చిన మీకు సాయం చేస్తాం: సీఎం

ఇంటి స్థలం కోసం పంత్ ట్వీట్: దేవభూమికి పేరు తెచ్చిన మీకు సాయం చేస్తాం: సీఎం

ఉత్తరాఖండ్‌(Uttarakhand)లో ఇంటి స్థలం పొందేందుకు సుదీర్ఘకాలంగా ప్రయత్నిస్తున్నానని టీమిండియా స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ (Rishabh Pant) తెలిపిన విజ్ఞప్తిపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ (Pushkar Singh Dhami) అత్యంత సానుకూలంగా స్పందించారు. పంత్ అభ్యర్థనపై స్పందిస్తూ, 'X' (ట్విట్టర్) వేదికగా సీఎం ధామీ హామీ ఇచ్చారు. పంత్ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి గర్వకారణమని, తన అద్భుతమైన ప్రదర్శనలు, విజయాలతో దేశ విదేశాల్లో దేవభూమికి కీర్తిని తెచ్చాడని ప్రశంసించారు. మాతృభూమిపై పంత్‌కు ఉన్న ప్రేమ, సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చి అభివృద్ధికి దోహదపడాలనే సంకల్పం ఎంతగానో అభినందనీయమని సీఎం పుష్కర్ సింగ్ ధామీ కొనియాడారు. 

అధికారులకు సీఎం కీలక ఆదేశాలు: 
రిషభ్ పంత్ (Rishabh Pant) లేవనెత్తిన ఈ అంశంపై వెంటనే స్పందించిన ముఖ్యమంత్రి ఫుష్కర్ సింగ్ ధామీ (Pushkar Singh Dhami) , తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అధికారులు త్వరలోనే పంత్‌ను నేరుగా సంప్రదించి, ప్రభుత్వ నిబంధనలకు లోబడి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారని హామీ ఇచ్చారు. ఢిల్లీ నుంచి తన స్థావరాన్ని ఉత్తరాఖండ్‌కు మార్చుకోవడానికి అనువైన స్థలం దొరకడం కష్టంగా మారిందని పంత్ విన్నవించగా, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఉచితంగా కాకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరకే భూమిని కొనుగోలు చేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని కూడా పంత్ తేల్చి చెప్పాడు. 

సొంత రాష్ట్రానికి తిరిగి సేవ చేయాలనే పంత్ సంకల్పం: 
ఉత్తరాఖండ్‌(Uttarakhand)లోని రూర్కీలో జన్మించిన రిషభ్ పంత్ (Rishabh Pant), తన కెరీర్ కోసం ఢిల్లీకి మారినప్పటికీ తన మాతృభూమితో ఎల్లప్పుడూ మంచి అనుబంధాన్ని కొనసాగిస్తున్నాడు. ఇటీవల 2025–26 ఆర్థిక సంవత్సరానికి గానూ ఏకంగా రూ. 23.84 కోట్ల ఆదాయపు పన్ను చెల్లించి ఉత్తరాఖండ్‌లోనే అత్యధిక పన్ను చెల్లించిన వ్యక్తిగా నిలిచిన పంత్, కేవలం నివాసం కోసమే కాకుండా తన మాతృభూమికి తిరిగి సేవ చేయాలనే విశాల దృక్పథంతో ఈ విజ్ఞప్తి చేశాడు. ముఖ్యమంత్రి ధామీ నుంచి సానుకూల స్పందన రావడంపై రిషభ్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ALSO READ : మెస్సీ హత్యకు కుట్ర.. ఫిఫా వరల్డ్ కప్ జరుగుతుండగా బాంబు దాడికి ప్లాన్