శ్రీశైలం డ్యాం కు పెరుగుతున్న వరద

శ్రీశైలం డ్యాం కు పెరుగుతున్న వరద

ఇన్ ఫ్లో: 2 లక్షల 8 వేల క్యూసెక్కులు…

డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం: 215 టీఎంసీలు.. ప్రస్తుత నీటిమట్టం: 859 అడుగులు 104 టీఎంసీలు..

కర్నూలు: ఎగువన కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం  డ్యామ్ కు వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం జలాశయం ఇన్ ఫ్లో 2 లక్షల 8 వేల 491 క్యూసెక్కులు ఉంది. తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోని ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువన నాగార్జుననసాగర్ కు 38 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా..ప్రస్తుతం నీటి మట్టం 859 అడుగులకు చేరింది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకు గాను ప్రస్తుతం నీటి నిల్వ సామర్థ్యం 104టీఎంసీలుగా ఉంది. ఎడమగట్టు జలవిద్యుత్ కేంద్రంలో 6 యూనిట్ల ద్వారా పూర్తి స్థాయిలో  విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు.

ఎగువన ఆల్మట్టి.. నారాయణపూర్ నుండి జూరాలకు వరద ప్రవాహం కాస్త తగ్గడంతో జూరాల డ్యామ్ వద్ద మూడు గేట్లు దించి మొత్తం 25 గేట్ల ద్వారా దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. జూరాల నుండి 25 గేట్లు ఎత్తి 1 లక్షా 65 వేల 205 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 28 వేల 292 క్యూసెక్కులు దిగువన శ్రీశైలానికి విడుదల చేస్తున్నారు. ఈ నీటికి తోడు జూరాలకు దిగువన కృష్ణా నది పరివాహక ప్రాంతాల్లో నిన్నటి నుండి కురుస్తున్న వర్షాల వల్ల అదనంగా మరో 15వేల క్యూసెక్కులు తోడవుతోంది. దీంతో శ్రీశైలం డ్యాం వద్ద ఇన్ ఫ్లో 2 లక్షల 8 వేల 491 క్యూసెక్కులుగా నమోదు అవుతోంది.