యూపీలో యాక్సిడెంట్.. 8 మంది మృతి

యూపీలో యాక్సిడెంట్.. 8 మంది మృతి

వారణాసి : ఉత్తరప్రదేశ్‌‌‌‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారు, ట్రక్కు ఢీకొని ఎనిమిది మంది అక్కడికక్కడే మృతిచెందారు. తొమ్మిదేండ్ల బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతని పరిస్థితి కూడా క్రిటికల్​గానే ఉంది. చనిపోయిన వారిలో నలుగురు ఒకే కుటుంబానికి చెందిన వారు ఉన్నారు. వారణాసి – -లక్నో హైవేపై బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితులంతా పిలిభిత్ జిల్లాకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. వారు కారు అద్దెకు తీసుకొని వారణాసికి వచ్చారు.

అందులో ఒకరు తమ కుటుంబ సభ్యుడి చితాభస్మాన్ని గంగానదిలో నిమజ్జనం చేయడానికి రాగా.. మిగిలిన వారు వారణాసిలోని ఆలయాల్లో పూజలు చేసేందుకు వచ్చారు. పూజల అనంతరం తిరిగి జాన్‌‌‌‌పూర్ వైపు వెళ్తుండగా కార్ఖియావ్ ప్రాంతంలో కారు ట్రక్కును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. యాక్సిడెంట్​లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు, మరో కుటుంబానికి చెందిన ఇద్దరు, కారు డ్రైవర్‌‌‌‌, మరో వ్యక్తి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ సంతాపం వ్యక్తం చేశారు. గాయపడిన బాలుడికి మెరుగైన చికిత్స అందించాలని జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు.