
ప్రగతి నగర్: నిజాంపేట్, బాచుపల్లి ఠాణా పరిధిలోని ప్రగతి నగర్ బావర్చి కమాన్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. రాంగ్ రూట్లో వచ్చిన ఆటోను తప్పించబోయిన టిప్పర్.. అదుపు తప్పి టూ వీలర్ను ఢీకొట్టింది. ఈ ఘటనలో టూ వీలర్ నడుపుతున్న నర్సింగ్ రావు అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. మృతుడిని టిప్పర్ కొంత దూరం వరకు ఈడ్చుకెళ్లింది. పోలీసుల వివరాలు.. బాచుపల్లి నుంచి గండి మైసమ్మ రహదారిలో ప్రగతి నగర్ కూడలి, బావర్చి హోటల్ వద్ద ఓ టాటా ఏస్ రాంగ్ రూట్లో వచ్చింది. ఆ వాహనానికి ఎదురుగా వస్తున్న టిప్పర్.. దాన్ని తప్పించబోయి పక్కనే వెళ్తున్న ద్విచక్ర వాహనదారుడ్ని ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనదారుడు అక్కడికక్కడే మృతి చెందాడు.
ప్రమాదం జరిగిన సమయంలో టిప్పర్ ద్విచక్ర వాహనదారున్ని కొంత దూరం ఈడ్చుకెళ్ళింది. ప్రమాదంలో ద్విచక్ర వాహనం ముందు భాగం, టాటా ఏస్ వాహనం ముందు భాగం దెబ్బతిన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి టిప్పర్ డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో టిప్పర్ డ్రైవర్ మద్యం సేవించి ఉన్నట్లుగా సమాచారం.