
పద్మారావునగర్, వెలుగు: రోజ్గార్ మేళాతో దేశవ్యాప్తంగా మొత్తం 5 లక్షల మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చామని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో ఇంత పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ చేయడం ఇదే ప్రథమమని పేర్కొన్నారు. శనివారం సికింద్రాబాద్ బోయిగూడ రైల్ కళారంగ్లో జరిగిన 7వ రోజ్ గార్ మేళాలో ఆయన పాల్గొని.. ఐటీ, బ్యాంకింగ్, పోస్టల్ రంగాలతో పాటు మొత్తం 10 శాఖల్లో ఉద్యోగాలు పొందిన 176 మంది అభ్యర్థులకు అపాయింట్ మెంట్ లెటర్లు అందజేశారు.
ఆయన మాట్లాడుతూ.. తల్లిదండ్రులు గర్వించేలా దేశం కోసం పనిచేయాలని కొత్తగా ఉద్యోగాలు పొందిన వారికి పిలుపునిచ్చారు. యూత్ ఎక్కువగా ఉన్న దేశాల్లో ఇండియానే నంబర్ వన్ అని అన్నారు. నేటి యువత మేథస్సు రానున్న రోజుల్లో ప్రపంచాన్ని శాసించేలా భారత్ రూపు దిద్దుకుంటుందన్నారు. 2022, అక్టోబర్ 22న దేశ యువతకు దీపావళి కానుకగా ప్రధాని మోదీ ‘రోజ్ గార్ మేళా’ను ప్రారంభించారని గుర్తు చేశారు. నెలకు 70 వేల చొప్పున యువతకు ఉద్యోగాలు కల్పిస్తూ, ఈ మేళాను విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నమని చెప్పారు.