- కూకట్పల్లిలో ఘటన
- యజమాని దగ్గర పని చేస్తున్న వర్కరే సూత్రధారి
కూకట్పల్లి, వెలుగు: హైదరాబాద్లోని కూకట్పల్లిలో సోమవారం రాత్రి బైక్పై హవాలా డబ్బు తరలిస్తుండగా, కండ్లలో కారం కొట్టి కొందరు దోపిడీ చేశారు. యజమాని దగ్గర పనిచేసే వ్యక్తే అంతా చేసి, సైలెంట్ వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. . పోలీసులు 24 గంటల్లోనే అసలు విషయం కనిపెట్టారు. బహదూర్పురాకు చెందిన అమీర్ హవాలా నిర్వహిస్తున్నాడు. ఖుస్రుద్ధీన్, నజీముద్ధీన్ నగదు తరలించేందుకు వర్కర్లుగా పని చేస్తున్నారు. యజమాని డబ్బుపై కన్నేసిన ఖుస్రుద్దీన్ ఎలాగైనా దోపిడి చేయాలని ప్లాన్ వేశాడు. డ్రైవర్ ఒమర్ షరీఫ్తో పరిచయం పెంచుకుని దోపిడికి ఒప్పించాడు.
సోమవారం అమీర్.. కూకట్పల్లిలో ఉండే పవన్ దగ్గర నుంచి అదే ప్రాంతంలో ఉండే ఇబ్రహీమ్కు హవాలా అందించాలని ఖుస్రుద్ధీన్కు, నజీముద్దీన్కు పంపించాడు. ఈ వివరాలను ఖుస్రుద్ధీన్ ఒమర్ కు చేరవేశాడు. అతను ఏడుగురు ముఠా సభ్యులతో సిద్ధమయ్యాడు. ఖుస్రుద్ధీన్కు, నజీముద్దీన్ రాత్రి 9.30కి పవన్ వద్దకు వెళ్లి, అతని సూచనలతో రూ. కోటి ఉన్న కాటన్ బాక్స్ ను ఇబ్రహీంకు ఇచ్చేందుకు బయల్దేరారు.
ఈక్రమంలో ఒమర్ ముఠా సభ్యులు మూడు బైక్లపై వచ్చి, కూకట్పల్లిలో బైక్పై వెళ్తున్న ఖుస్రుద్దీన్, నజీముద్దీన్ కళ్లలో కారం కొట్టి, డబ్బు బాక్స్ తో పరారయ్యారు. ఖుస్రుద్ధీన్ ఏమీ తెలియనట్టు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు.. నిందితులు వదిలివెళ్లిన బైక్ను స్వాధీనం చేసుకొని, వాళ్లు శంషాబాద్ ఎయిర్ పోర్ట్లో ఉన్నట్టు గుర్తించారు. అక్కడ ఒమర్ షరీఫ్, గౌస్ సద్దాం, అబ్దుల్ హమీద్ను అరెస్ట్ చేసి, విచారించగా.. అసలు కుట్రదారుడు ఖుస్రుద్ధీన్ అని బయటపడింది. అతన్నికూడా అరెస్టు చేసి, రూ.77 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో ఐదుగురు పరారీలో ఉన్నారు.
