- కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులు చెల్లించిన అధికారులు
- 40 నియోజకవర్గాల్లో వేగంగా పనులు
- రెండేళ్లలో పూర్తి చేసేలా ప్లాన్
- రూ.20,600 కోట్లు కావాలని ప్రభుత్వానికి రిపోర్ట్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పాఠశాలల నిర్మాణానికి నోడల్ ఏజెన్సీగా ఉన్న టీజీఈడబ్ల్యూఐడీసీ(తెలంగాణ స్టేట్ ఎడ్యుకేషన్ విమెన్ అండ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్)కి రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో నాబార్డ్ ఇటీవల రూ.100 కోట్ల లోన్ రిలీజ్చేసింది. ఈ ఫండ్స్ తో కాంట్రాక్టర్లకు అధికారులు పెండింగ్ బిల్లులు చెల్లించారు. గతేడాది ఇంటిగ్రేటెడ్స్కూళ్లకు ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్ లో ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదని కార్పొరేషన్ఆఫీసర్లు చెబుతున్నారు. ఈ నెలతో ఆర్థిక సంవత్సరం పూర్తవుతున్న నేపథ్యంలో నిధులు విడుదల చేయాలని ఆర్థిక శాఖను కోరుతున్నారు.
79 నియోజకవర్గాలకు స్కూళ్లు మంజూరు
రాష్ట్రవ్యాప్తంగా 105 నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్రెసిడెన్షియల్స్కూళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో పాఠశాలను25 ఎకరాల్లో రూ.200 కోట్లతో నిర్మించేందుకు ప్లాన్చేసింది. ఇప్పటికే 79 నియోజకవర్గాలకు ఇంటిగ్రేటెడ్స్కూళ్లను మంజూరు చేసింది. వీటిలో 40 నియోజకవర్గాల్లో పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో పనులను రెండేళ్లలో పూర్తి చేయాలని టెండర్లు దక్కించుకున్న కంపెనీలకు ప్రభుత్వం సూచించింది. ఈ పాఠశాలలకు 2026–----27 ఫైనాన్షియల్ఇయర్లో రూ.9,800 కోట్లు, 2027–28 ఫైనాన్షియల్ఇయర్లో రూ.10, 800 కోట్లు అవసరమని అధికారులు అంచనా వేసి, సర్కారుకు నివేదిక ఇచ్చారు.
5వ తరగతి నుంచి ఇంటర్వరకు..
యంగ్ ఇండియా ఇంటిగ్రేడెట్ రెసిడెన్షియల్ స్కూళ్లు ఓపెన్అయితే.. ఒక్కో పాఠశాలలో 2,560 మంది విద్యార్థులు 5వ తరగతి నుంచి ఇంటర్వరకు చదువుకోనున్నారు. స్కూళ్లలో వేర్వేరు బ్లాక్లు ఉంటాయి. ప్రతీ పాఠశాలలో 120 మంది టీచర్లు పని చేస్తారు. అలాగే, లైబ్రరీలో 5 వేల పుస్తకాలు, కంప్యూటర్ ల్యాబ్లో 60 కంప్యూటర్లు ఉంటాయి. ఈ పాఠశాలల భవనాలు నిర్మించే ప్రాంతాల్లో 25 ఏళ్లుగా ఉష్ణోగ్రతలు, వర్షపాతం, చలి, వేడిగాలుల తీవ్రత తదితర వాతావరణ అంశాలను ఆర్కిటెక్చర్సంస్థ పరిగణనలోకి తీసుకుంది. ప్రతీ డార్మెటరీ గదిలో 10 బెడ్లు, 2 బాత్రూమ్లు ఉండేలా వాతావరణ అనుకూల భవనాలను డిజైన్చేసింది. క్లాస్రూమ్లు, కంప్యూటర్ సెంటర్, లైబ్రరీ, ఆడిటోరియం, ఇండోర్ గేమ్స్, క్రికెట్, ఫుట్బాల్ మైదానాలు, బాస్కెట్బాల్, వాలీబాల్, టెన్నిస్ కోర్టులు, అవుట్డోర్ జిమ్, థియేటర్, ల్యాండ్స్కేప్ కోర్టుల వంటి సౌకర్యాలు ఉండనున్నాయి.
ఫస్ట్ ఫేజ్లో 19 చోట్ల..
మొదటి దశలో కొడంగల్, హుస్నాబాద్, హుజూర్నగర్, ములుగు, ఖమ్మం, కొల్లాపూర్, చాంద్రాయణగుట్ట, మంచిర్యాల, అచ్చంపేట, తిరుమలగిరి, మధిర, నల్గొండ, మంథని, పాలేరు, వరంగల్, అందోల్, భూపాలపల్లి, స్టేషన్ ఘన్పూర్, తుంగతుర్తి ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ బిల్డింగ్లు నిర్మిస్తున్నారు.
