
మెహిదీపట్నం, వెలుగు : బోనాల పండుగకు ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 26న వేడుకలు ప్రారంభమవుతాయని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.మంగళవారం గోల్కొండ కోటలో పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బీ, విద్యుత్, దేవాదాయ, వైద్యారోగ్య, జీహెచ్ఎంసీ, ఫైర్, టూరిజం, సమాచార శాఖ అధికారులతో శ్రీ జగదాంబ మహంకాళి దేవస్థానంలో బోనాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
మంత్రి మాట్లాడుతూ..జూన్ 26న గోల్కొండ కోటలోని శ్రీ జగదాంబ మహంకాళి(ఎల్లమ్మ తల్లి) అమ్మవారికి తొలి బోనం సమర్పించిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. బోనాల సమయంలో గోల్కొండకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని, ఉచిత ప్రయాణం సందర్భంగా మహిళలు ఎక్కువమంది వచ్చే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా బస్సులు నడపాలన్నారు. పిక్ పాకెటింగ్, చైన్ స్నాచింగ్, ఈవ్ టీజింగ్ జరగకుండా చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఉత్సవాల సందర్భంగా ఆరు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేస్తున్నట్లు వైద్యశాఖాధికులు మంత్రికి వివరించారు.
జీహెచ్ఎంసీ నుంచి గోల్కొండ కోట పరిసరాల ప్రాంతాల్లో అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ , ఖైరతాబాద్ జోనల్ కమిషనర్ అనురాగ్ జయంతి, ఎమ్మెల్యే కౌసర్ మొయినోద్దిన్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన, ఎండోమెంట్ అధికారులు, గోల్కొండ ఏసీపీ సయ్యద్ ఫయాజ్, గోల్కొండ బోనాల ట్రస్ట్ కమిటీ చైర్మన్ చంటిబాబు తదితరులు పాల్గొన్నారు.