రెండు వేల కరెన్సీ నోటును రద్దు చేసేందుకు కేంద్రం నిర్ణయం తీసుకుందంటూ వస్తున్న ఊహాగానాలకు చెక్ పెట్టేశారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్రం అటువంటి ప్రతిపాదన ఏమీ తీసుకోలేదని తేల్చిచెప్పారు. మొదటి సారి అధికారంలోకి వచ్చిన తర్వాత మోడీ ప్రభుత్వం వెయ్యి, 500 రూపాయల నోట్లను రద్దు చేసింది. ఈ వ్యవహారంపై జాతీయ స్థాయిలో పెద్ద దుమారమే రేగింది. దాదాపు నెల రోజుల పాటు సామాన్యులు కూడా నోట్లు మార్చుకునేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. ఆ తర్వాత ప్రభుత్వం వెయ్యి నోటును పూర్తిగా ఎత్తేసి రూ.2 వేల నోటును చలామణిలోకి తెచ్చింది.
అయితే ఇటీవల కాలంలో 2 వేల నోటు మార్కెట్లో అంతగా కనిపించకపోవడంతో రద్దు పుకార్లు మొదలయ్యాయి. రూ.2 వేల నోటును రద్దు చేసే ఆలోచనలో కేంద్రం ఉందని… అందువల్ల రిజర్వ్బ్యాంక్కు చేరుతున్న నోట్లను చేరినట్టే అట్టేపెట్టేస్తోందని, ఈ కారణంగా మార్కెట్లో నోట్ల చలామణి తగ్గిపోయిందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
దీనిపై స్పందించిక కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై క్లారిటీ ఇచ్చారు. ప్రభుత్వం అటువంటి ఆలోచన ఏమీ చేయడం లేదని… ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.