
ఫిషరీ రంగాన్ని ఆదుకునేందుకు ఆత్మ నిర్భర్ భారత్ ప్యాకేజీలో భాగంగా పీఎం మత్స్య సంపద యోజన పథకం కింద రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. దీని ద్వారా ఈ రంగంలో 55 లక్షల మందికి పైగా ఉపాధితో పాటు రూ.లక్ష కోట్ల ఎగుమతులు పెరిగేలా చర్యలు తీసుకుంటామన్నారు. రూ.20 లక్షల కోట్ల ఆత్మ నిర్భర భారత్ ప్యాకేజీలో భాగంగా మూడో రోజు ప్రెస్ మీట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి వ్యవసాయ అనుబంధ రంగాలకు అందించే సాయం గురించి వివరించారు. వ్యవసాయం, పాడి పరిశ్రమ, ఫిషరీపై ఆధారపడిన వారికి కేంద్రం అండగా నిలుస్తుందన్నారు. ఈ రంగాలకు సంబంధించి మొత్తం 11 చర్యలు ప్రకటించారు.
దేశంలో మత్స్యాకారులకు మార్కెటింగ్ పై అవగాహన లేక సమస్యలు వస్తున్నాయని అన్నారు నిర్మలా సీతారామన్. ఈ రంగంలో మరిన్ని సదుపాయాలు పెంచేందుకు పీఎం మత్స్య సంపద యోజన ద్వారా రూ.20 వేల కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. మెరైన్, ఐలాండ్ ఫిషరీస్, ఆక్వా కల్చర్ లో సుస్థిర అభివృద్ధికి చేపట్టాల్సిన పనులకు రూ.11 వేల కోట్లు, ఫిషింగ్ హార్బర్లు, కోల్డ్ చైన్స్, మార్కెట్లు వంటి వాటి కోసం రూ.9 వేల కోట్లు కేటాయిస్తామన్నారు. ఈ చర్యల ద్వారా రానున్న అయిదేళ్లలో 70 లక్షల టన్నుల అదనపు మత్స్య ఉత్పత్తి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అలాగే మత్స్యకారులకు, బోట్లకు బీమా సదుపాయం కల్పిస్తామని సీతారామన్ చెప్పారు. చేపల వేట నిషేధ సమయంలో ఆర్థిక సాయం చేస్తామన్నారు. గడువు తీరిన ఆక్వా హేచరీలకు రిజిస్ట్రేషన్ గడువు మూడు నెలలు పొడిగిస్తున్నామని తెలిపారు.