- మార్కెట్కు ఫిచ్ షాక్..
- యూఎస్ సావరిన్ క్రెడిట్ రేటింగ్ను తగ్గించిన బ్రోకరేజ్ కంపెనీ
- నిఫ్టీ ఒక శాతం క్రాష్..రూ.3.48 లక్షల కోట్లు నష్టపోయిన ఇన్వెస్టర్లు
- 82.85 కి పతనమైన డాలర్ మారకంలో రూపాయి
బిజినెస్ డెస్క్, వెలుగు: యూఎస్ సావరిన్ క్రెడిట్ రేటింగ్ను బ్రోకరేజి కంపెనీ ఫిచ్ రేటింగ్స్ డౌన్గ్రేడ్ చేయడంతో గ్లోబల్ మార్కెట్లు బుధవారం అతలాకుతలం అయ్యాయి. ఇండియన్ స్టాక్ మార్కెట్ కూడా క్రాష్ అయ్యింది. బెంచ్మార్క్ ఇండెక్స్లు సెన్సెక్స్, నిఫ్టీ ఒక శాతం చొప్పున నష్టపోయి కీలక లెవెల్స్ కింద ముగిశాయి. సెన్సెక్స్ బుధవారం ఇంట్రాడేలో వెయ్యి పాయింట్ల వరకు పడగా, చివరికి 677 పాయింట్ల నష్టంతో 65,783 దగ్గర క్లోజయ్యింది. నిఫ్టీ ఇంట్రాడేలో 19,450 దిగువకు పడిపోయింది. చివరి గంటలో బయ్యింగ్ రావడంతో 207 పాయింట్ల లాస్తో 19,527 దగ్గర సెటిలయ్యింది. బీఎస్ఈలోని కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ వాల్యూ రూ.3.48 లక్షల కోట్లు తగ్గి రూ.306.8 లక్షల కోట్లకు దిగొచ్చింది. 2011 లో కూడా ఇలానే యూఎస్ క్రెడిట్ రేటింగ్ను ఏఏఏ నుంచి ఏఏ+ కి, నెగెటివ్ అవుట్ లుక్తో ఎస్ అండ్ పీ డౌన్గ్రేడ్ చేసింది. ఆ టైమ్లో కూడా గ్లోబల్ మార్కెట్లు భారీగా పతనమయ్యాయి. కాగా, ఇండియన్ ఎకానమీ స్ట్రాంగ్గా ఉందని, కంపెనీల క్యూ1 రిజల్ట్స్ మెరుగ్గానే ఉన్నాయని ఎనలిస్టులు చెబుతున్నారు.
ఫిచ్ తాజా నిర్ణయం మన మార్కెట్పై పెద్దగా ప్రభావం చూపదని భావిస్తున్నారు. ‘ రేటింగ్ను ఫిచ్ డౌన్గ్రేడ్ చేయడంలో ఆశ్చర్యం లేదు. మార్కెట్ పతనం కొంత కాలమే ఉంటుంది. యూఎస్ ఎకానమీ మెరుగవుతుందనే అంచనాలతో గ్లోబల్ మార్కెట్లు పెరుగుతూ వస్తున్నాయి. ఈ పరిస్థితులపై ‘డౌన్గ్రేడ్’ పెద్దగా ప్రభావం చూపదు’ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు. ఆటో, బ్యాంక్స్, మెటల్ షేర్లు బుధవారం సెషన్లో ఎక్కువగా పడ్డాయి. టాటా స్టీల్, టాటా మోటార్స్, హీరో మోటో, ఐషర్ మోటార్స్, కోల్ ఇండియా షేర్లు 3.5 శాతం వరకు నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వంటి ఇండెక్స్ హెవీ వెయిట్ షేర్లు కూడా ఒక శాతానికి పైగా పడ్డాయి. ఇన్వెస్టర్ల భయాన్ని కొలిచే వొలటాలిటీ ఇండెక్స్ వీఐఎక్స్ బుధవారం 10 శాతం పెరగడం విశేషం.