ఢిల్లీ: రోడ్డు ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల రూపాయల పరిహారం అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఈమేరకు 2019 మోటర్ వెహికిల్స్ సవరణ బిల్లులో ప్రతిపాదించినట్లు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గురువారం లోక్సభలో చెప్పారు. తీవ్ర గాయాలైతే 2.5 లక్షల రూపాయలు ఇచ్చే ప్రతిపాదన కూడా బిల్లులో చేర్చామన్నారు. కఠినమైన లైసెన్సింగ్ విధానం, ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే జరిమానాలు పెంచడం, వెహికల్స్ ఫిట్నెస్కు సంబంధించిన టెస్టులు , రోడ్డు సెక్యూరిటీ లాంటి అంశాలు కూడా ఈ బిల్లులో ఉన్నాయన్నారు. ఎలక్ట్రికల్ వెహికిల్స్ను ప్రోత్సహించేందుకు వీలుగా వాటికి రిజిస్ట్రేషన్ చార్జీలను మాఫీ చేయాలని ప్రతిపాదించినట్లు మంత్రి గడ్కరీ చెప్పారు.
‘బీఎస్ఎన్ఎల్ స్టాఫ్కు జూన్ జీతాలు ఇచ్చాం’
ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న బీఎస్ఎన్ఎల్ సిబ్బందికి జూన్ నెల జీతాలు చెల్లించామని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ గురువారం రాజ్యసభలో చెప్పారు. క్యాజువల్ లేబర్స్, టెంపరరీ వర్కర్స్కు కూడా రెగ్యులర్గా జీతాలు ఇస్తున్నామన్నారు. రెవెన్యూ పెరిగేలా చర్యలు తీసుకోవాలని బీఎస్ఎన్ఎల్కు ఆదేశించామని చెప్పారు. ఫిబ్రవరి పేమెంట్లో కొంత ఆలస్యం జరిగినమాట నిజమేనన్నారు.