
ప్రజా సమస్యలపై నిరంతరం రాజీలేని పోరాటం చేయాలని బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర సమన్వయకర్త ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జనగాం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన బీఎస్పీ జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆర్ఎస్ ప్రవీణ్ మాట్లాడుతూ బతుకమ్మ కుంటలో భూ ఆక్రమణలకు పాల్పడిన స్థానిక ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రెవెన్యూ అధికారుల తప్పిదాల వల్ల ధరణి పోర్టల్లో పొరపాటుగా నమోదైన వేలాది ఎకరాల జాఫర్ గడ్ భూములను వెంటనే సవరించాలని డిమాండ్ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వరి కొనుగోలుపై నిర్లక్ష్యం చేయడం వల్ల లక్షలాది మంది రైతులు కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తూ, వడ్ల కుప్పలపై మరణించే దుస్థితి రాష్ట్రంలో నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి, వరి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం మిలర్లతో కుమ్మక్కై రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని విమర్శించారు.
ఈ నియంత ప్రభుత్వాన్ని చిత్తుగా ఓడించాలె
రాష్ట్ర ప్రభుత్వం పేద విద్యార్థులు చదివే ప్రభుత్వ యూనివర్సిటీలకు బడ్జెట్ లో సరిపడ నిధులు కేటాయించకుండా, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను భర్తీ చేయకుండా విశ్వవిద్యాలయాలను నిర్వీర్యం చేస్తుందని ఆర్ఎస్ ప్రవీణ్ విమర్శించారు. కానీ అనురాగ్, మల్లారెడ్డి లాంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలకు వేలాది ఎకరాల భూమిని కేటాయిస్తూ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల విద్యార్థులకు రిజర్వేషన్లు తొలగించడం దుర్మార్గమైన చర్యగా పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 200 మంది విద్యార్థులకు కేవలం ఇద్దరు టీచర్లతో బోధన జరగడం ఏ రకంగా సమంజసమో కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. బీఎస్పీ అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణలో శాస్త్రీయ విద్యా విధానాన్ని అమలు చేస్తామని అన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల్లో వైద్య ఖర్చులు భరించలేక, ఎంతోమంది పేదలు కార్పోరేట్ ఆస్పత్రుల్లో మరణించే దుస్థితిని తెలంగాణలో నెలకొనడం సిగ్గుచేటని విమర్శించారు. రాష్ట్రంలో వైకుంఠ దామాలు, పల్లె ప్రకృతి వనం,రైతు వేదికల నిర్మాణం కోసం పేదల అసైన్డ్ భూములను గుంజుకుంటున్న నియంత ప్రభుత్వాన్ని వచ్చే ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు నీలిరంగు జెండాలతో గ్రామాల్లోకి వచ్చే కుల సంఘాల నాయకుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అనంతరం జిల్లాలోని జనగాం, స్టేషన్ ఘన్ పూర్, పాలకుర్తి నియోజకవర్గాలకు చెందిన పలువురు కాంగ్రెస్, టీఆర్ఎస్ కార్యకర్తలకు కండువా కప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.