దళిత బంధుకే మార్గదర్శకాలను విడుదల చేయకుండా కాలయాపన చేస్తున్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు గిరిజనులను కూడా మోసం చేయాలని చూస్తున్నారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సీఎం కేసీఆర్ ప్రజల సొమ్మును టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు అప్పజెప్పి దళితులందరినీ దగా చేశారని మండిపడ్డారు. తండాలకు నిధులు, యూనివర్సిటీ, పోడు భూములకు సంబంధించి కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలన్నీ ఎక్కడ పోయినయి అని ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు. ఈమేరకు ఆయన ఒక ట్వీట్ చేశారు.
దళిత బందుకే ఇంతవరకు మార్గదర్శకాలు విడుదల చేయకుండా #TRS పార్టీ కార్యకర్తలకు ప్రజల సొమ్ము అప్పజెప్పి దళితులనందరినీ దగాజేసి, మళ్లీ గిరిజనులను కూడా మోసం చెయ్యాలని చూస్తున్నాడు #KCR !! గిరిజనులకు 10% రిజర్వేషన్, తండాలకు నిధులు, యూనివర్సిటీ, పోడు భూములు ఇవ్వన్నీ ఎక్కడ పోయినయి? pic.twitter.com/sEPZFPlBvh
— Dr.RS Praveen Kumar (@RSPraveenSwaero) September 17, 2022
సీఎం కేసీఆర్ హామీ ఇది..
వారం రోజుల్లో రాష్ట్రంలోని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా జీవో రిలీజ్ చేస్తామని, అలాగే ‘గిరిజన బంధు’ ఇస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన బంజారా భవన్, ఆదివాసీ భవన్ ప్రారంభోత్సవ సభలో ఆయన ఈ హామీ ఇచ్చారు. గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ఇవ్వాలని అసెంబ్లీలో తీర్మానం చేశామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆ తీర్మానాన్ని కేంద్రానికి పంపి ఏడేళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆమోదించలేదని చెప్పారు.