హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 58 రోజుల తర్వాత ఇవాళ్టి నుంచి( మంగళవారం) ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. ఇప్పుడున్న చార్జీలతోనే ఊర్లు, టౌన్ల మధ్య బస్సులు నడుస్తున్నాయి. సీట్లు ఉన్న మేరకే ప్రయాణికులను ఎక్కించుకుంటారు. ఫిజికల్ డిస్టెన్స్ పాటిస్తూ సర్వీసులు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 6 వేలకుపైగా బస్సులు నడవనున్నాయి.
రాత్రి జర్నీలు ఉండయి
రోజూ ఉదయం 6 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే బస్సులు నడుస్తాయి. గమ్య స్థానానికి చేరుకునేందుకు ఒక గంట గ్రేస్ పీరియడ్ ఉంటుంది. ఎంజీబీఎస్ కంటెయిన్మెంట్ జోన్లో ఉండటంతో.. జిల్లాల నుంచి హైదరాబాద్కు వచ్చే బస్సులేవీ అక్కడి వరకు వెళ్లవు. ఎక్కువ బస్సులు జేబీఎస్కే వస్తాయి. వరంగల్ రూట్లో వచ్చే బస్సులు ఉప్పల్ వరకు, మహబూబ్నగర్ నుంచి వచ్చేవి ఆరాంఘర్, నల్లగొండ నుంచి వచ్చేవి హయత్ నగర్, సంగారెడ్డి నుంచి వచ్చేవి బీహెచ్ఈఎల్ వరకు మాత్రమే వస్తాయి. అక్కడి నుంచి ఆటోలు, ట్యాక్సీల్లో వెళ్లాల్సి ఉంటుంది. ఇంటర్ స్టేట్ బస్సులు నడవడానికి అనుమతి లేకపోవడంతో సరిహద్దుల్లో ఆగిపోనున్నాయి. అక్కడి నుంచి మళ్లీ బస్సులు ఎక్కి ప్రయాణించాలి.
శానిటైజేషన్.. మాస్కులు..
అన్ని డిపోల్లో ఇప్పటికే బస్సులను శానిటైజ్ చేసి సిద్ధం చేశారు. ప్రతి ట్రిప్పు తర్వాత శానిటైజ్ చేస్తారు. ప్రతి ప్యాసింజర్ కు థర్మల్ స్క్రీనింగ్ చేయనున్నారు. మాస్క్ కట్టుకుంటేనే బస్సులోకి అనుమతిస్తారు. కండక్టర్, డ్రైవర్లకూ మాస్క్ తప్పనిసరి. బస్సు ఎక్కక ముందే కండక్టర్ వద్ద టికెట్లు తీసుకోవాలి. ఆర్టీసీకి రోజుకు రూ. 12 కోట్ల వరకు ఆదాయం వచ్చేది. లాక్డౌన్తో రూ. 800 కోట్ల మేర కలెక్షన్ కోల్పోయింది.
దేశ వ్యాప్తంగా లక్ష దాటిన కరోనా కేసులు