రాజేంద్రనగర్, వెలుగు: మరో ఆర్టీసీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ కుల్సుంపురా పీఎస్ పరిధిలోని కార్వాన్లో ఉండే సురేందర్గౌడ్ రాణిగంజ్–2 డిపోలో 14 ఏళ్లుగా ఆర్టీసీలో కండక్టర్గా పని చేస్తున్నాడు. లోన్ తీసుకొని ఇల్లు కట్టుకున్న సురేందర్ కు డబ్బులు కట్టకపోవడంతో చెక్ బౌన్స్ అయ్యిందని ఫైనాన్స్ సంస్థ నుంచి ఫోన్ వచ్చింది. డ్యూటీ రాదేమోనని మనస్థాపం చెందిన సురేందర్ గౌడ్ ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు.
కుటుంబసభ్యులు దగ్గర్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే సురేందర్ చనిపోయినట్లు డాక్టర్లు చెప్పారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. సురేందర్ మృతదేహాన్ని పోస్టుమార్టానికి ఉస్మానియా మార్చురీకి తరలించారు. మృతుడికి భార్య, కొడుకు, కూతురు ఉన్నారు.