హైదరాబాద్: లాక్ డౌన్ అమలు చేసినప్పటి నుంచి ఇప్పటివరకు TSRTCకి దాదాపు రూ.450 కోట్లు నష్టం వచ్చినట్లు తెలిపారు రవాణశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. ఆయన ఓ ఇంటర్వ్యూ సందర్భంగా మాట్లాడారు. ప్రస్తుత సమయంలో సిబ్బందికి జీతాలు చెల్లించడానికి కూడా తీవ్ర ఇబ్బంది పడుతున్నామని.. ఈ క్రమంలోనే ఆర్టీసీ ఉద్యోగులకు సగం జీతమే చెల్లిస్తున్నామని చెప్పారు. లాక్ డౌన్ ఎత్తేశాక బస్సులను ఎలా నడుపాలన్నది ఇంకా నిర్ణయం తీసుకోలేదన్న మంత్రి.. ఫ్యాక్టరీలకు కార్మికులను తీసుకెళ్లేందుకు.. అవసరమైన సంస్థలకు ఆర్టీసీ బస్సులను అద్దెకు ఇస్తామని తెలిపారు. దీనివల్ల సంస్థకు కొన్ని నిధులు వస్తాయని చెప్పారు.
5వేల కోవిడ్ కిట్లను డ్రైవర్లకు రవాణా శాఖ ద్వారా అందజేసి, కొవిడ్పై అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. గ్రీన్ జోన్లు, ఆరెంజ్ జోన్లలో బస్సులు నడపాలా, వద్దా అనే విషయంపై కేబినెట్లో నిర్ణయం తీసుకుంటామన్నారు. లాక్ డౌన్ వల్ల అన్ని రంగాలకు నష్టం జరిగిందని, కేంద్రం అన్ని రంగాలను ఆదుకోవాలని కోరామని చెప్పారు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.