–జకర్తా: ఆసియా ఒలింపిక్ క్వాలిఫయర్స్ టోర్నీలో ఇండియా షూటర్ల గురి అదురుతోంది. మంగళవారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో రుద్రాంక్ష్ పాటిల్–-మెహులీ ఘోష్ గోల్డ్ మెడల్ సాధించారు. ఫైనల్లో ఈ ఇద్దరు 16–10తో చైనా ద్వయం షెన్ యుఫాన్–జుహు మింగ్షుయ్పై గెలిచారు. ఈ టోర్నీలో ఇండియాకు ఇది ఐదో గోల్డ్ కావడం విశేషం. క్వాలిఫికేషన్లో 631.1 పాయింట్లతో రెండో ప్లేస్లో నిలిచిన రుద్రాంక్ష్–మెహులీ.. మెడల్ పోరులో మాత్రం అదరగొట్టారు.
ఎలవెనిల్ వలారివన్–-అర్జున్ 629 పాయింట్లతో ఆరో స్థానంలో నిలిచారు. ఇక10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ విభాగంలో అర్జున్ చీమా–రిథమ్ సంగ్వాన్ సిల్వర్ గెలిచింది. టైటిల్ ఫైట్లో అర్జున్–రిథమ్ 11–17తో థు విన్ ట్రిన్– క్వాంగ్ హుయ్ ఫామ్ (వియత్నాం) చేతిలో ఓడారు. క్వాలిఫికేషన్లో ఇండియా జోడీ 582, వియత్నాం జంట 580 పాయింట్లతో తొలి రెండు ప్లేస్ల్లో నిలిచారు. మరోవైపు10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ జూనియర్ కేటగిరీలో ఏపీకి చెందిన ఉమామహేశ్ ఇషా అనిల్తో కలిసి గోల్డ్ మెడల్ నెగ్గాడు.
