మాస్కో : తూర్పు ఉక్రెయిన్లో టెంపరరీ క్యాంపులు ఏర్పాటు చేసుకున్న సైనిక స్థావరాలపై రాకెట్లతో దాడి చేసినట్టు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆదివారం ఉదయం క్రమటోర్క్స్పై జరిపిన దాడిలో 600 మంది ఉక్రెయిన్ సైనికులు చనిపోయారని ప్రకటించింది. తమ ఆధీనంలో ఉన్న డాన్టెస్క్ ఏరియా.. మకివ్కాలోని రష్యన్ బ్యారక్స్పై ఈ ఏడాది ప్రారంభంలో ఉక్రెయిన్ దాడి చేసిందని చెప్పింది. ఈ ఘటనలో 89 మంది రష్యన్స్ చనిపోయారని, దీనికి ప్రతీకారంగానే ఈ దాడి చేశామని రష్యా ప్రకటించింది.
ఇంటెలిజెన్స్ అధికారులు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఉక్రెయిన్ ఆర్మీని లక్ష్యంగా చేసుకొని అటాక్ చేశామని చెప్పింది. ఒక బిల్డింగ్లో 700 మంది, రెండో బిల్డింగ్లో 600 మంది ఉక్రెయిన్ సైనికులు ఉన్నారని, వీరిలో 600 మందికి పైగా చనిపోయినట్టు తెలిపింది. అయితే, ఈ విషయం నమ్మలేమని రాయిటర్స్ రిపోర్టర్లు అంటున్నారు. రాకెట్లతో దాడి జరిగిన ఆనవాలు లేవని తెలిపారు. డెడ్బాడీలు, రక్తపు మరకలు కూడా కనిపించలేవని చెప్పారు. కాగా, ఆదివారం తెల్లవారుజామున తూర్పు ఉక్రెయిన్ నగరంలోని కొన్ని బిల్డింగ్స్పై రష్యా దాడి చేసిందని, అయితే ఈ అటాక్లో ఎవరూ చనిపోలేదని క్రమటోర్క్స్ మేయర్ తెలిపారు.