రష్యా మిసైల్​ దాడితో.. కుప్పకూలిన బిల్డింగ్​

రష్యా మిసైల్​ దాడితో.. కుప్పకూలిన బిల్డింగ్​

కీవ్​: తూర్పు ఉక్రెయిన్​లోని చాసివ్​ యార్​ పట్టణంలోని అపార్ట్​మెంట్​పై రష్యా రాకెట్​తో దాడి చేసింది. ఈ ఘటనలో 15 మంది చనిపోయారని, ఇంకా 20 మంది వరకు శిథిలాల కింద చిక్కుకుపోయారని ఉక్రెయిన్​ అధికారులు తెలిపారు. గాయపడిన వారిని దగ్గర్లోని హాస్పిటల్​కు తీసుకెళ్లామని వివరించారు. శనివారం అర్ధరాత్రి టైంలో ఈ ఎటాక్​ జరిగిందని తెలిపారు. జనాలు నివాసం ఉండే ఏరియాలను టార్గెట్​ చేసుకుని రష్యా బలగాలు దాడులు చేస్తున్నాయని అధికారులు ప్రకటించారు. జూన్​లో ఓ షాపింగ్​మాల్​పై రష్యా దాడి చేయగా.. 19 మంది చనిపోయారని, ఈ నెలలో దక్షిణ ఒడెస్సాలోని అపార్ట్​మెంట్​పై​ చేసిన ఎటాక్​లో 21 మంది మరణించారని వివరించారు. ఉక్రెయిన్​ మిలటరీ బేస్​లను లక్ష్యంగా చేసుకుని తాము దాడులు చేస్తున్నామని రష్యా చెబుతోందని, కానీ సాధారణ జనాలనే టార్గెట్​ చేస్తోందని డోనెట్స్క్ ​ గవర్నర్​ పావ్లో కైరిలెంకో విమర్శించారు. చాసివ్​ యార్​ పట్టణంపై చేసిన దాడిలోనూ సాధారణ జనాలే చనిపోయారని, అయినా రష్యా మాత్రం ఉక్రెయిన్​ బలగాలపైనే దాడి చేస్తున్నామని ప్రకటిస్తోందని అన్నారు. శిథిలాల కింద ఇరుక్కుపోయిన ముగ్గురిని  ఉక్రెయిన్​ ఆర్మీ కాపాడిందని, మరికొంత మంది ఉన్నట్టు అనుమానిస్తున్నామని తెలిపారు. రెస్క్యూ బృందం సహాయక చర్యలు చేపడుతోందని ప్రకటించారు.