- క్రమాటోర్స్క్ సిటీలో ఘటన
- 11 మంది మృతి.. మరో 70 మందికి గాయాలు
- పోలీసుల అదుపులో దాడికి సహకరించిన వ్యక్తి
కీవ్: ఈస్ట్ ఉక్రెయిన్లోని క్రమాటోర్స్క్ నగరంపై రష్యా మిసైల్స్తో దాడి చేసింది. ప్రముఖ రెస్టారెంట్ను లక్ష్యంగా చేసుకుని 2 క్షిపణులను ప్రయోగించింది. ఈ అటాక్లో 11 మంది చనిపోయారు. 70 మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఈ దాడి పక్కా ప్లాన్ ప్రకారం జరిగినట్టు ఉక్రెయిన్ నేషనల్ పోలీసులు తేల్చారు. ఉక్రెయిన్కు చెందిన వ్యక్తే రష్యాకు హెల్ప్ చేసినట్లు గుర్తించి, అదుపులో తీసుకుని విచారిస్తున్నారు.
శిథిలాల కింద మరికొంత మంది
ఒక మిసైల్ పిజ్జా రెస్టారెంట్ను, రెండో క్షిపణి క్రమాటోర్స్క్ సిటీ శివార్లలోని గ్రామాన్ని ఢీకొట్టింది. క్రమాటోర్స్క్ దాడిలో 18 అంతస్తుల బిల్డింగ్స్, 65 ఇండ్లు, 5 స్కూల్స్, 2 కిండర్ గార్డెన్స్, ఒక షాపింగ్ సెంటర్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, రిక్రియేషనల్ భవనం ధ్వంసమైనట్లు రీజినల్ గవర్నర్ పావ్లో కైరిలెంకో తెలిపారు. రెస్క్యూ కొనసాగుతున్నదని, శిథిలాల కింద మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నామన్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వివరించారు. కాగా, రెస్టారెంట్కు తరుచూ జర్నలిస్ట్లు, ఉక్రెయిన్ సైనికులు, స్థానికులు, లేబర్స్ పెద్ద సంఖ్యలో వస్తూ పోతుంటారు. వీరందరినీ లక్ష్యంగా చేసుకుని రష్యా దాడి చేసిందని ఉక్రెయిన్ పోలీసులు చెప్పారు.
అమాయకుల ప్రాణాలు తీస్తున్నది : జెలెన్ స్కీ
రెస్టారెంట్పై దాడిని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రంగా ఖండించారు. రష్యా అమాయకుల ప్రాణాలు తీస్తోందని మండిపడ్డారు. సాధారణ ప్రజలను టార్గెట్ చేస్తుందన్నారు. యుద్ధంలో ఎంతోమంది సివిలియన్స్ చనిపోయారని వివరించారు. కాగా, రెస్టారెంట్పై దాడికి సంబంధించి రష్యాకు సహకరించిన వ్యక్తిని లోకల్ ఉద్యోగిగా గుర్తించారు. రెస్టారెంట్ పాపులారిటీ, ఎవరెవరు వస్తూ పోతుంటారనే దానిపై అనుమానితుడు ఫొటోలు తీసి రష్యాకు పంపినట్లు సెక్యురిటీ సర్వీస్ అధికారులు తేల్చారు.