
రైతు భరోసా నిధులు జమ కొనసాగుతోంది. తొమ్మిది రోజుల్లో 9వేల కోట్లు రైతుల ఖాతాలో జమ చేయనుంది ప్రభుత్వం. ఈ క్రమంలో మొదటి రోజు జూన్ 16న రెండెకరాల్లోపు ఉన్న రైతులకు రైతు భరోసా నిధులు పడిన సంగతి తెలిసిందే..ఇవాళ (జూన్ 17) మూడెకరాల వరకు ఉన్న రైతుల అకౌంట్లో డబ్బులు జమ చేసింది ప్రభుత్వం. ఇవాళ రూ.1551.89 కోట్లను విడుదల చేసింది ప్రభుత్వం.
జూన్ 17న 3 ఎకరాల వరకు ఉన్న రైతులందరి ఖాతాలలోకి ఎకరానికి 6 వేల చొప్పున రైతు భరోసా నిధుల జమ చేయడం జరిగిందని, అందుకోసం రూ.1551.89 కోట్లు విడుదల చేశామని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుగారు తెలిపారు. 10.45 లక్షల మంది రైతులకు సంబంధించిన 25.86 లక్షల ఎకరాలకు రైతు భరోసా నిధులు జమ చేశామన్నారు. ఎకరాలతో సంబంధం లేకుండా మిగిలిన వారందరికి రైతు భరోసా నిధులు జమ చేస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు.
ALSO READ | రైతులకు గుడ్ న్యూస్ : మధిర మార్కెట్లో మిర్చి కొనుగోలు ప్రారంభం
జూన్ 16న రెండెకరాల్లోపు ఉన్న రైతుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయి. 2 ఎకరాల వరకు ఉన్న రైతులందరి ఖాతాలలోకి ఎకరానికి 6 వేల చొప్పున 41.25 లక్షల మంది రైతులకు 39.16 లక్షల ఎకరాలకు గాను 2349.83 కోట్ల రైతు భరోసా నిధులు జమ చేశారు.
రాజేంద్ర నగర్ అగ్రివర్శిటీలో రైతు నేస్తం ప్రోగ్రామ్ ప్రారంభోత్సవంలో రైతు భరోసా డబ్బులు రిలీజ్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. రైతులకు తొమ్మిది రోజుల్లో 9 వేల కోట్లు జమ చేస్తామని చెప్పారు. 70 లక్షల 11 వేల మంది రైతులకు రైతు భరోసా డబ్బులు పడతాయని చెప్పారు. మొత్తం కోటి 49 లక్షల ఎకరాలకు రైతు భరోసా ఇస్తున్నామన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పథకాలు ఆపబోమన్నారు రేవంత్.