శబరిమల అయ్యప్ప దేవాలయాన్ని మండల పూజలో భాగంగా ఇవాల(ఆదివారం) సాయంత్రం తెరిచారు. రేపటి(సోమవారం) ఉదయం నుంచి భక్తులను ఆలయంలోకి అనుమతి ఇవ్వనున్నట్లు ట్రావెన్కోర్ ఆలయ బోర్డు (టీడీబీ) వర్గాలు తెలిపాయి. ఈ క్రమంలో కరోనా నిబంధనలను పక్కాగా అమలు చేయనున్నారు. దీనికి సంబంధించి ఆలయ బోర్డు కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది.
నిలక్కల్, పంబా బేస్ క్యాంప్కు చేరుకునే 48 గంటల ముందు చేయించుకున్న పరీక్షలో కరోనా నెగెటివ్ రిపోర్టుతో వచ్చిన భక్తులనే దర్శనానికి అనుమతిస్తారు. వర్చువల్ క్యూ పద్ధతిలో రిజిస్టర్ చేసుకున్న భక్తులను రోజుకు వెయ్యి మంది చొప్పున దర్శనం కల్పించనున్నారు. శని, ఆదివారాల్లో 2 వేల మంది భక్తులు అయ్యప్పను దర్శించుకోవచ్చు. 10 ఏళ్లలోపు 60 ఏళ్ల పైబడిన వయస్సు ఉన్న వారిని దర్శనానికి అనుమతించరు. పంబా నదిలో దిగి స్నానాలు చేయడానికి భక్తులకు అనుమతి లేదని.. పంబాబేస్ క్యాంపుతో పాటు ఆలయ పరిసరాల్లో భక్తులు బస చేయడానికి వీలు లేదని ట్రావెన్కోర్ ఆలయబోర్డు తెలిపింది. అయితే భక్తులు స్నానాలు చేసేందుకు అనుకూలంగా ప్రత్యేకంగా షవర్లను ఏర్పాటు చేశారు.