- విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
- చెలిమి, అంకురం కార్యక్రమాలు ప్రారంభం
హైదరాబాద్, వెలుగు: కాలానికి అనుగుణంగా విద్యావ్యవస్థలోనూ అవసరమైన మార్పులు తెస్తున్నామని విద్యా మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శాస్త్రీయంగా చదివితేనే జాతి నిర్మాణంలో విద్యార్థులు నిర్మాణాత్మక పాత్రను పోషిస్తారని పేర్కొన్నారు. బుధవారం రంగారెడ్డి జిల్లా శివరాంపల్లి హైస్కూల్లో ‘చెలిమి’,‘అంకురం’కార్యక్రమాలను మంత్రి లాంచనంగా ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుత ప్రపంచంలో రకరకాలుగా ఎదురయ్యే ఒత్తిళ్లను ఎదుర్కొనేలా చిన్ననాటి నుంచే విద్యార్థులను తీర్చిదిద్దేలా ‘చెలిమి’ని, వ్యాపార దృక్పథంతో పాటు వ్యాపార వ్యవస్థాపక ఆలోచనలను పెంపొందించేందుకు ‘అంకురం’ ను ప్రారంభించామని వివరించారు. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ ఏడాది నుంచే ప్రతి జిల్లాలో ఒక్కో హైస్కూల్లో చెలిమి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని వెల్లడించారు. అంకురం పైలట్ ప్రాజెక్టు 8 జిల్లాల్లో 35 కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్లకు నిర్వహిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ వినోద్ కుమార్, ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ శ్రీదేవసేన తదిరులు పాల్గొన్నారు.
లైబ్రరీ ఓపెనింగ్
శంషాబాద్ : మన బస్తీ– మన బడిలో ప్రోగ్రామ్ లో భాగంగా శంషాబాద్ జిల్లా పరిషత్ హైస్కూల్ లో మౌలిక వసతుల కల్పనకు పైలెట్ ప్రాజెక్టు కింద రూ. 1 కోటి 15 లక్షలతో కొత్త లైబ్రరీ మంత్రి సబిత ఓపెనింగ్ చేశారు. ఇందులో బాయ్స్ కు 4, గర్ల్స్ కు 3 గదుల చొప్పు మొత్తం 7 అదనపు తరగతి గదులు ఉన్నాయి. తెలుగు మీడియంతో పాటు ఇంగ్లీష్ మీడియం, సైన్స్ ల్యాబ్, కంప్యూటర్లు ఏర్పాటు చేయడంతో విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెరుగుతుందన్నారు.
రెసిడెన్షియల్ జోన్లోకి మార్చాలని వినతి
గండిపేట్: శివరాంపల్లి గ్రామాన్ని ఓపెన్ స్పేస్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్లోకి మార్చాలని కోరుతూ ఐక్యత వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కోరారు. అసోసియేషన్ అధ్యక్షుడు పి.వెంకటేష్ ఆధ్వర్యంలో మంత్రి పి. సబితకు, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాష్ గౌడ్కు వినతిపత్రాలు అందించారు. శివరాంపల్లిలో ఎన్నో ఏండ్లుగా ఇండ్లను నిర్మించుకుని ఉంటున్నామని, పదేండ్ల కిందట ఓపెన్ స్పేస్ జోన్గా మార్చారని గుర్తుచేశారు.