
- ఉన్ని పరిశ్రమ మరింత డెవలప్ కావాలి
- హ్యాండ్లూమ్, టెక్స్టైల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్
కోస్గి/నారాయణపేట, వెలుగు: నారాయణపేట జిల్లాలో ఉన్ని పరిశ్రమ మరింత అభివృద్ధి చెందాలని రాష్ట్ర హ్యాండ్లూమ్, టెక్స్టైల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ చెప్పారు. కోస్గి మండలంలో ఉన్న ఉన్ని పారిశ్రామిక సహకార సంఘంలో సోమవారం మగ్గాలను పరిశీలించి కార్మికులతో మాట్లాడారు. ఉన్ని అమ్మకాలపై ఆరా తీయగా గిట్టుబాటు ధర రావడం లేదని కార్మికులు ఆమె దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పాత సొసైటీల అప్పులను వసూలు చేయాలని తహసీల్దార్, ఏడీలను ఆదేశించారు. కార్మికులకు పావలా వడ్డీకి రుణాలు ఇవ్వాలని సూచించారు.
షెడ్ ఏర్పాటు కోసం ప్రపోజల్స్ పంపించాలన్నారు. జిల్లాలో అవసరం ఉన్న మగ్గాల వివరాలు అడిగి తెలుసుకొని, కార్మికులకు శిక్షణ ఇప్పిస్తామని తెలిపారు. ఊల్మగ్గాలు కావాలని కార్మికులు కోరగా వాటి కోసం సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆమె వెంట కలెక్టర్ సిక్తా పట్నాయక్, ట్రైనీ కలెక్టర్ గరిమ, మున్సిపల్ కమిషనర్ శశిధర్, తహసీల్దార్ బక్క శ్రీనివాస్, ఎంపీడీవో శ్రీధర్ ఉన్నారు.
అనంతరం నారాయణపేట స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో నిర్మాణంలో ఉన్న కామన్ ఫెసిలిటీ హ్యాండ్లూమ్ బిల్డింగ్ పనులను శైలజా రామయ్యర్ పరిశీలించారు. మూడు నెలల్లో పనులు పూర్తి చేసి సేల్స్ ఎంపోరియం, హ్యాండ్లూమ్ మ్యూజియం, రీసెర్చ్ డెవలప్మెంట్, ట్రైనింగ్, కామన్ ఫెసిలిటీ సెంటర్, ఫుడ్ కోర్ట్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ను అప్పగించాలన్నారు. నారాయణపేటలో చేనేత ఉత్పత్తులు పెంచడం, కార్మికుల్లో స్కిల్స్డెవలప్మెంట్కు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. అలాగే పట్ణణంలోని చేనేత కార్మికులతో మాట్లాడారు.