టాటా, కియా,  మహీంద్రా అమ్మకాలు అప్​

టాటా, కియా,  మహీంద్రా అమ్మకాలు అప్​

న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్​ విడిభాగాల కొరత కారణంగా ఈ ఏడాది మార్చిలో హోల్​సేల్స్​ తగ్గాయని మారుతీ సుజుకీ, హ్యుండై ప్రకటించాయి. అయితే టాటా మోటార్స్​, స్కోడా, కియా, టొయోటా, మహీంద్రా అమ్మకాలు మాత్రం పెరిగాయి. ఈసారి అమ్మకాలు గత ఐదేళ్లలో అత్యధికమని టొయోటా కిర్లోస్కర్​ ప్రకటించింది. తమ కార్ల అమ్మకాలు చాలా బాగుతున్నాయని మహీంద్రా తెలిపింది. మారుతీ సుజుకీ ఇండియా అమ్మకాలు గత మార్చితో పోలిస్తే ఈసారి మార్చిలో  1,55,417 యూనిట్ల నుంచి 7 శాతం తగ్గి 1,43,899 యూనిట్లకు చేరుకున్నాయి. పూర్తి ఆర్థిక సంవత్సరంలో కంపెనీ 16,52,653 యూనిట్లను అమ్మింది. ఎలక్ట్రానిక్​ భాగాల కొరతను తీర్చడానికి అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని తెలిపింది.   హ్యుందాయ్ మోటార్ ఇండియా తన మొత్తం అమ్మకాలు గత ఏడాది మార్చి నెలతో పోలిస్తే ఈ మార్చిలో 14 శాతం తగ్గి 55,287 యూనిట్లకు పడిపోయాయి.  .

43 శాతం పెరిగిన టాటా సేల్స్​
టాటా మోటార్స్  అమ్మకాలు 2021 మార్చిలో 29,654 యూనిట్ల నుండి 43 శాతం గ్రోత్​తో గత నెలలో 42,293 యూనిట్లకు పెరిగాయి. మహీంద్రా గత ఏడాది మార్చిలో 16,700 యూనిట్లను అమ్మగా, ఈసారి మార్చిలో ఇవి 65 శాతం పెరిగి 27,603 యూనిట్లకు చేరుకున్నాయి. టొయోటా కిర్లోస్కర్​ అమ్మకాలు 14 శాతం పెరిగాయి. యూనిట్ల సంఖ్య 15,001 నుంచి 17,131 యూనిట్లకు పెరిగాయి. కియా సేల్స్​ 18 శాతం పెరిగి 22,622 యూనిట్లకు ఎగిశాయి. స్కోడా సేల్స్​ ఐదింతలు పెరిగాయి. యూనిట్ల సంఖ్య 1,159 నుంచి 5,608 యూనిట్లకు పెరిగింది. ఎంజీ మోటార్స్​ అమ్మకాలు 14.5 శాతం తగ్గి 4,721 యూనిట్లకు చేరుకున్నాయి. నిస్సాన్​ అమ్మకాలు కూడా 25 శాతం తగ్గి 3,007 యూనిట్లకు పడిపోయాయి. టీవీఎస్​ సేల్స్​ 4.55 శాతం తగ్గి 3,07,954 యూనిట్లకు పడ్డాయి.