ఎస్సీ గురుకుల సెక్రటరీగా ఆర్ఎస్పీ అక్రమాలు : సామ రామ్మోహన్ రెడ్డి

 ఎస్సీ గురుకుల సెక్రటరీగా ఆర్ఎస్పీ అక్రమాలు : సామ రామ్మోహన్ రెడ్డి
  • ఆయన అవినీతిపై విచారణ జరపాలి: సామ రామ్మోహన్ రెడ్డి 

హైదరాబాద్, వెలుగు:  గురుకులాల సెక్రటరీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళిత స్టూడెంట్లకు అందాల్సిన వెల్ఫేర్ స్కీములను దారి మళ్లించారని పీసీసీ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మెహన్ రెడ్డి ఆరోపించారు. ఇపుడు ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. మంగళవారం గాంధీ భవన్ లో సామ రామ్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఆర్ఎస్ ప్రవీణ్ గురుకుల సెక్రటరీగా పనిచేసినపుడు ఎన్నో అవకతవకలు జరిగాయని, వీటిపై  కేంద్ర ఆడిట్ అధికారులు విచారణ చేసి రిపోర్ట్ ఇచ్చారని చెప్పారు. 

అందులో ఆర్ఎస్ ప్రవీణ్ చేసిన అక్రమాలపై స్పష్టంగా ఉందన్నారు. ఆయన కార్యదర్శిగా ఉన్నప్పుడు రెండు స్కూళ్లు, ఒక కాలేజీలో కోడింగ్ ట్రైనింగ్ పేరుతో ఏడాదికి 4.5 కోట్లు ఖర్చు చేశారని, కానీ ఒక్క పాఠశాలలో మాత్రమే శిక్షణ ఇచ్చి, మూడు స్కూళ్లలో ఇచ్చినట్లుగా బిల్లులు తీసుకున్నారని ఆరోపించారు. 240 మంది పిల్లలకు కోడింగ్​పై ట్రైనింగ్ ఇస్తే రూ.4.5 కోట్లు  ఎలా ఖర్చు అవుతాయని ప్రశ్నించారు. 

పనుల కేటాయింపులో జరిగిన అవకవతవకలపై విజిలెన్స్ విచారణ జరిపించాలని సామ డిమాండ్ చేశారు.  టాపర్ లైసెన్సెస్ పేరు మీద ఐఐటీ.. జేఈఈ, నీట్ ఆన్​లైన్​ కోర్సులకు  రూ. 20 కోట్లు ఖర్చు పెట్టారని,  వీటికి ఎలాంటి టెండర్లు పిలవలేదని తెలిపారు.  ఆర్థిక శాఖ అనుమతి కూడా తీసుకోలేదన్నారు.  సమ్మర్ క్యాంప్​ల పేరు మీద కూడా నిధులు పక్కదారి పట్టించారని, యూనిఫాం, దుప్పట్లను కూడా ఆర్ఎస్పీ వదిలి పెట్టలేదని సామ తీవ్ర ఆరోపణలు చేశారు.