
న్యూఢిల్లీ: మన దేశంలో స్వలింగ(ఆడ, ఆడ – మగ, మగ) వివాహాలకు అనుమతి లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది భారతీయ కుటుంబ వ్యవస్థకు వ్యతిరేకమని చెప్పింది. ఇలాంటి వివాహాలను మన చట్టాలు, సమాజం, సంప్రదాయాలు, విలువలు గుర్తించవని తెలిపింది. స్వలింగ వివాహాలను గుర్తించాలంటూ ఢిల్లీ హైకోర్టులో ఫైల్ అయిన పిటిషన్లకు సమాధానంగా కేంద్రం గురువారం అఫిడవిట్ దాఖలు చేసింది. ‘‘ఇద్దరు స్వలింగ వ్యక్తులు కలిసి ఉండడాన్ని… భార్య, భర్త, పిల్లలు అనే ఇండియన్ ఫ్యామిలీ కాన్సెప్ట్ తో పోల్చి చూడలేం. ఇలాంటి వివాహాలను రిజిస్టర్ చేస్తే.. ప్రస్తుతమున్న చట్టాలను ఉల్లంఘించినట్లే అవుతుంది” అని కేంద్రం పేర్కొంది.
దేశంలోని వివిధ మత సంప్రదాయాలకు అనుగుణంగా పార్లమెంట్ వివాహ చట్టాలను రూపొందించిందని.. ఇప్పుడు వాటికి వ్యతిరేకంగా చేస్తే, పూర్తి సిస్టమ్ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేసింది. వివాహమనేది ప్రైవేట్ కాన్సెప్ట్ కాదని, అది సమాజంతో ముడిపడి ఉందని తెలిపింది. మన దేశంలో వివాహాలకు చట్టబద్ధత ఉన్నప్పటికీ, దాని గుర్తింపు మాత్రం.. ఎన్నో ఏండ్ల నాటి సంస్కృతీ సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలు, సామాజిక విలువలపై ఆధారపడి ఉందని చెప్పింది. కాగా, స్పెషల్ మ్యారేజెస్ యాక్ట్ కింద స్వలింగ వివాహాలను గుర్తించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో మరో పిటిషన్ ఫైల్
అయింది.