పద్మారావునగర్, వెలుగు: ప్రజలను ఇబ్బందులకు గురి చేసేవారు ఎవరైనా కఠినంగా వ్యవహరిస్తామని సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు. బన్సీలాల్ పేట డివిజన్ లోని సీసీ నగర్ డబుల్ బెడ్ రూమ్ పరిసరాల్లో రాత్రివేళల్లో కొందరు వ్యక్తులు మద్యం, గంజాయి తాగుతూ తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఇటీవల స్థానికులు ఎమ్మెల్యే కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయన ఆదివారం పోలీసులతో కలిసి పర్యటించారు.
రాత్రివేళల్లో పెట్రోలింగ్ నిర్వహించాలని, వెంటనే బస్తీలో ని వాహనాలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని స్పందించిన గాంధీ నగర్ సీఐ రవి కుమార్ ను ఎమ్మెల్యే ఆదేశించారు. బస్తీలో ఎవరైనా ఇబ్బందులకు గురి చేస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని బస్తీవాసులకు సూచించారు. బన్సీలాల్ పేట డివిజన్ బీజేపీ నేత సురేశ్తల్లి ఇటీవల మృతిచెందగా ఆయన ఇంటికి ఎమ్మెల్యే వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించి తన ప్రగాడ సానుభూతి తెలిపారు. ఆయన వెంట కార్పొరేటర్ కుర్మ హేమలత, బస్తీ అధ్యక్షుడు నర్సింగరావు, బీఆర్ఎస్ నేతలు ప్రేమ్ కుమార్, లక్ష్మీపతి తదితరులు ఉన్నారు.