నీళ్లు ఉన్నాయ్​.. వృథా చేయొద్దు : సందీప్​ సుల్తానియా

నీళ్లు ఉన్నాయ్​.. వృథా చేయొద్దు : సందీప్​ సుల్తానియా
  •     తాగునీటి ఎద్దడి రాకుండా అధికారులు చూసుకోవాలి
  •     రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్​ సుల్తానియా

భద్రాద్రికొత్తగూడెం/అశ్వాపురం, వెలుగు: వేసవిలో తాగునీటి ఎద్దడి రాకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్​డబ్ల్యూఎస్  శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్​ సుల్తానియా ఆఫీసర్లను ఆదేశించారు. ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం జిల్లాల్లో సోమవారం ఆయన పర్యటించారు. అశ్వాపురం మండలంలోని కుమ్మరిగూడెం వద్ద మిషన్​ భగీరథ ఇన్​టెక్​ వెల్​ను కలెక్టర్ ప్రియాంక అలతో కలిసి పరిశీలించారు. 

గోదావరి నీటి నిల్వల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇన్​టెక్​ వెల్​ నుంచి రోజు ఎంత నీటి సరఫరా జరుగుతోందని అడిగారు. రథంగుట్ట వద్ద 40 ఎంఎల్​డీ వాటర్​ ట్రీట్మెంట్​ ప్లాంట్స్​ను పరిశీలించారు. పాములపల్లి, మిట్టగూడెం గ్రామాల మధ్య అటవీ ప్రాంతాల్లో నివసిస్తున్న గుత్తికోయల గ్రామాన్ని సందర్శించారు. అనంతరం కలెక్టరేట్ లో పలు శాఖలతో సందీప్​ సుల్తానియా రివ్యూ మీటింగ్ నిర్వహించారు. జిల్లాలో నీటి వనరులు ఉన్నాయని తాగునీటి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆఫీసర్లపై ఉందన్నారు. 

నీటి వృథా కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మిషన్​ భగీరథ అధికారులు క్లోరినేషన్​ టెస్ట్ లకు సంబంధించి రిజిస్టర్లను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. రానున్న రోజుల్లో తాగునీటికి డిమాండ్​ పెరుగనున్న క్రమంలో నీటి ఎద్దడి రాకుండా పక్కా ప్రణాళికలను సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. హ్యాండ్​ పంపులు, బోర్లకు ఎప్పటికప్పుడు రిపేర్లు చేస్తూ పర్యవేక్షించాలన్నారు.  మీటింగ్​లో ఐటీడీఏ పీఓ ప్రతీక్​ జైన్, జిల్లా ఫారెస్ట్​ ఆఫీసర్​ కృష్ణగౌడ్, మిషన్​ భగీరథ ఎస్​ఈ కృపాకర్​ రెడ్డి, సీఈ శ్రీనివాస్, ఈఈ తిరుమలేష్​, పబ్లిక్​హెల్త్​ ఈఈ రంజిత్, జడ్పీ సీఈఓ ప్రసూన, భూగర్భ జల శాఖాధికారి బాలుతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. 

3 నెలలకు సరిపడా నీరు

ఖమ్మం టౌన్​: ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్​తో  కలిసి వైరా రిజర్వాయర్ ఇన్​టెక్ వెల్​ను సుల్తానియా సందర్శించి, నీటి లభ్యతను పరిశీలించారు.  అనంతరం  న్యూ కలెక్టరేట్​ లో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. పాలేరు, వైరా, దుమ్ముగూడెం రిజర్వాయర్ లలో రాబోయే 3 నెలలకు సరిపడా నీరు నిల్వ ఉందన్నారు. పైప్ లైన్ లలో ఎక్కడా లీకేజీలు లేకుండా చూడాలన్నారు.  పాలేరుకు నాగార్జున సాగర్ నుంచి 2 టీఎంసీల నీరు వచ్చిందని తెలిపారు.  ఈ సమీక్షలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సత్యప్రసాద్, ఖమ్మం నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, శిక్షణ సహాయ కలెక్టర్లు మయాంక్ సింగ్, యువరాజ్ తదితరులు పాల్గొన్నారు.