- కెమికల్ తాగినట్టు నటించి హాస్పిటల్లో అడ్మిట్
- నాటకమేనని తేల్చిన డాక్టర్లు
సంగారెడ్డి, వెలుగు: సంగారెడ్డి జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఓ యువకుడు సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు నాటకం ఆడి జైలు నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించి విఫలమయ్యాడు. జైలు అధికారుల అప్రమత్తతతో అతడి ప్లాన్ బయటపడింది. సంగారెడ్డి జిల్లాలోని రాయికోడ్ మండలం శంషోద్దీన్పూర్ గ్రామానికి చెందిన వినోద్(24) దొంగతనాల కేసులో నాలుగు నెలల క్రితం రిమాండ్ ఖైదీగా సంగారెడ్డి జిల్లా జైలుకు వచ్చాడు. గురువారం సాయంత్రం జైలులోని ఆర్వో వాటర్ప్లాంట్కు వినియోగించే కెమికల్ తాగినట్టు వినోద్ జైలు అధికారులను నమ్మించాడు.
వెంటనే అతడిని సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే అక్కడ డాక్టర్లు పరీక్షలు నిర్వహించగా అతను ఎలాంటి కెమికల్ సేవించలేదని తేలింది. ఆస్పత్రికి తరలించే సమయంలో అక్కడి నుంచి తప్పించుకునేందుకు వినోద్ ఈ నాటకం ఆడినట్టు అధికారులు గుర్తించారు. ఖైదీ ప్రస్తుతం తమ కస్టడీలోనే ఉన్నట్లు జైలు సూపరింటెండెంట్ సంతోష్ కుమార్ రాయ్ స్పష్టం చేశారు. గతంలోనూ అతను ఇలాంటి చర్యలకు పాల్పడినట్టు తెలిపారు.

