ధనుర్మాసంలో మంచు కురుస్తుంది.. .. వీధులు చల్లగా ఉంటాయి.... ముగ్గులతో అందంగా ఉంటాయి... పంటలు పండుతాయి. పండుగలూ మొదలవుతాయి... ప్రతి ఏడాది పండుగలు సంక్రాంతితో మొదలవుతాయి. అందుకే సంక్రాంతిని సంవత్సరంలో తొలి పండుగగా చెబుతారు.
ఏడాది మొత్తం కష్టపడి పండించిన పంటలు ఇళ్లకు చేరే సమయం... గంగిరెద్దుల ఆటలతో, హరిదాసులు సంకీర్తనలతో, చిన్నారులు... అమ్మాయిలు గొబ్బి పాటలతో, కొత్త అల్లుళ్ళ సందళ్ళతో ఊరంతా సందడిగా మారే రోజు సంక్రాంతి.. రైతుల పండుగ... జానపదుల పండుగ.. శ్రమ జీవుల పండుగ... జంతువులలో సైతం దివ్యత్వాన్ని ప్రతిబింబించే పండుగ.. పిల్లలకు గాలి పటాల పండుగ.
దక్షిణాదిన శుభకార్యాలన్నీ సంక్రాంతి తరువాతనే ఆరంభిస్తారు. సంక్రాంతికి నెల రోజుల ముందే సూర్యుడు ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తాడు. అప్పటి నుంచి పండుగ నెల ప్రారంభమవుతుంది. రంగు రంగు ముగ్గులతో ధనుర్మాసానికి స్వాగతం పలుకుతారు ఆడవాళ్లు . నెల రోజులపాటు ఇంటి లోగిళ్లు ముగ్గులతో కళకళలాడుతాయి. మన పెద్దవాళ్లు ఎన్నో ఆరోగ్య సూత్రాలతో తరతరాల నుంచీ ఈఆచారాలను పాటిస్తున్నారు.
శీతాకాలంలో చలి ప్రభావానికి కండరాలు పట్టేసే అవకాశం ఉంది. తెల్లవారు జామునే లేచి ముగ్గులు వేస్తే బద్దకం పోతుంది.వాటికోసం కోసం నడుము వంచడం.అటూ కదలడం వల్ల కండరాలకు కూడా మంచి వ్యాయామం దొరుకుతుంది.
►ALSO READ | మీరు నిజంగా ఉప్పు తినడం తగ్గించాలా ? అసలు ఉప్పు ఎవరు తినకూడదో తెలుసా..
ధనుర్మాసం నెలరోజుల పాటు వైష్ణవాలయాలో ప్రతిరోజూ తెల్లవారు జామున తిరుప్పావై వైభవంగా జరుగుతుంది. ఆలయాల్లో దేవునికి కట్టెపొంగలి ప్రసాదంగా నివేదిస్తారు. దీని వెనుక కూడా ఆరోగ్య సూత్రం ఇమిడివుంది. శీతాకాలం చలి ప్రభావానికి మిరియాలతో చేసిన వట్టిపొంగలి మంచి విరుగుడుగా పనిజేస్తుందట.
హిందువుల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకలైన పండుగల్లో సంక్రాంతి పండుగే ప్రధానం. సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి ప్రవేశించే రోజును మకర సంక్రాంతి అంటారు. భోగభాగ్యాలతో, సిరిసంపదలను కురిపిస్తూ... కొత్తకాంతులను విరజిమ్ముతూ... కొత్త ధాన్యాలతో ... సంక్రాంతి లక్ష్మి ప్రవేశిస్తుందని కవులు వర్ణిస్తారు. పిల్లలూ... పెద్దలూ.. ఇంటిల్లిపాదీ ఎంతో శోభాయమానంగా జరుపుకుంటారు. ఈ పండుగను మూడు రోజులు జరుపుకోవడం ఆనవాయితీ.
మొదటి రోజు ( 2026 జనవరి 14) భోగితోనే వైభోగం..
జీవింతంలో ఇప్పటి వరకు అనుభవించిన అన్ని పీడలు తొలగి .. భోగతో వైభోగం మొదలవుతుంది అంటారు. ఈ రోజు (2026 జనవరి 14) పెద్దలు, పిల్లలు అందరు వేకువజామునే నిద్ర లేచి కొన్ని రోజులుగా సేకరించిన ఆవు పిడకలు.. ఎండు కట్టెలు.. వేసి భోగిమంటను వేస్తారు. కొన్ని రాష్ట్రాలలో పనికిరాని పాత సామానుతో మంట వేసే ఆచారం కూడా ఉంది. అంతేకాదు ఈ భోగి మంటల్లో ఇంట్లో పనికిరాని పాత వస్తువులు చేస్తే భోగిపీడ పోతుందని నమ్ముతారు. కుటుంబమంతా ఈ భోగిమంట చుట్టూ చేరి చలి కాచుకుంటూ పాటలు పాడతారు. కొన్ని ప్రాంతాలలో డప్పు వాయిస్తూ పాటలు పాడతారు. ఇలా భోగిపీడను వదిలించుకోవడం అనాదిగా వస్తున్న ఆచారం. తర్వాత తలంటు స్నానం చేసి, కొత్త బట్టలు ధరించి తీపి తింటారు.
గారెలు, బూరెలు, పులిహోర, అరిసెలు, జంతికలు, పప్పుబిళ్లలు వంటి రకరకాల పిండి వంటలు చేసుకుని బంధుమిత్రులతో కలిసి భోజనం చేస్తారు. ఆనవాయితీ ఉన్నవారు తమ తమ ఇళ్లల్లో గౌరీ దేవీ రూపంలో గొబ్బెమ్మలను పెట్టి పాటలు పాడి పూజ చేసి ముత్తైదువులకు తాంబాలం ఇస్తారు.
భోగిరోజు ... 12 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న చిన్న పిల్లలకు రేగు పండ్లు, బొరుగులు, చిల్లర నాణాలు వంటివి కలిపి భోగిపళ్లు పోస్తారు. అలా చేస్తే దృష్టి దోషాలు పోతాయని నమ్ముతారు. భోగిరోజు సాయంత్రం వైష్ణవాలయాలలో శ్రీ గోదాదేవి... రంగనాధుల కళ్యాణం అత్యంత వైభవంగా జరుపుతారు.
రెండో రోజు ( 2026 జనవరి 15 )మకర సంక్రాంతి
క్రాంతి' అంటే వెలుగు... సం... అంటే చేరుకో వడం... సంక్రాంతి పండుగ అంటే వెలుగును ఆహ్వానించడం అని అర్థం . సూర్యుడు ధనుస్సు రాశి నుంచి మకరరాశిలోకి ప్రవేశించిన రోజు మకర సంక్రాంతి. ఈ రోజును పవిత్ర పుణ్య దినంగా బావిస్తారు. ఇలాంటి పుణ్య ఘడియలు ఆషాడశుద్ధ ఏకాదశి వరకు ఉంటాయి. ఈ రోజు ( జనవరి 15) కొత్త కుండలో పాలు పొంగించి, కొత్త బియ్యం, కొత్త బెల్లంతో పొంగలి వండుతారు. ఇదే రోజు హరిహరసుతు తనయుడు.. కేరళలో వేంచేసిన.. ధర్మశాస్తుడు.. అయ్యప్పస్వామి జ్యోతి రూపంలో భక్తులకు దర్శనమిస్తాడని పురాణాల ద్వారా తెలుస్తుంది.
మకరరాశికి అధిపతి శని. అందుకే మకర సంక్రాంతి రోజున శనికి ప్రీతికరమైన నల్ల నువ్వులు బెల్లంతో చేసిన లడ్డూలు గుమ్మడికాయలు దానం చేస్తారు. ఇలా చేస్తే ఆరోగ్యం. సిరిసంపదలు వృద్ధి చెందుతాయని విశ్వాసం. ఈ రోజున ఏ దైవాన్ని పూజించినా, యజ్ఞం చేసినా విశేష ఫలితం ఉంటుందంటారు. ఈ రోజున పితృదేవతల ప్రీతి కోసం తర్పణాలు వదులుతారు. అంతేకాదు ఈ రోజు మరణిస్తే స్వర్గప్రాప్తి కలుగుతుందని విశ్వసిస్తారు.
మూడో రోజు ( 2026 జనవరి 16)కనుమ
మూడవరోజును కనుము పండుగగా జరుపుతారు. ఇది కర్షకుల పండుగ . ఈ రోజు పాడిపంటలను, పశుసంపదలను లక్ష్మీస్వరూపంగా పూజిస్తారు. ఈ పండుగ రోజున ఆడపడుచులు పసుపుకుంకుమలు ఇచ్చి పుచ్చుకుంటారు. సంవత్సరమంతా రైతులకు చేదోడువాదోడుగా ఉండే పశువులను కృతజ్ఞతాపూర్వకంగా ఈ రోజున అలంకరించి పూజిస్తారు. పశువుల కొమ్ములకు రంగులు వేసి అలంకరిస్తారు.
గంగిరెద్దుల వాళ్లు ఇల్లిల్లూ తిరుగుతూ ఎద్దుల అందరికి ఆశీర్వాదాలు ఇస్తూ ఆడి పాడి అలరిస్తారు. సంక్రాంతికి వారు సంపాదించేది. సంవత్సరమంతా వస్తుందని చెబుతారు. కొన్ని ప్రాంతాలలో ప్రభలను ఊరేగిస్తారు. కలియుగ వైకుంఠం తిరుపతిలో శ్రీవాది పార్వేటి ఉత్సవం కనుమ రోజు ( 2026 జనవరి 16) ఎంతో కన్నుల పండుగగా జరుగుతుంది.
నాలుగో రోజు ( 2026 జనవరి 17) ముక్కనుమ
పండుగను మూడు రోజులు జరిపి నాలుగో రోజు ఆనందాల నుంచి ఆధ్యాత్మికంలోకి వస్తారు. చాలా ఊళ్లలో గ్రామ దేవతలకు నైవేద్యాలు పెట్టి సంబరాలు జరుపుతారు. రంగు రంగు ముగ్గులకు స్వస్తి పలికి రథం ముగ్గులను ఇళ్లముందు వేసి పండుగను వీడ్కోలు పలు కుతారు. చెన్నై లో దీనిని తిరుగుడు పండగ అంటారు. ఈ రోజు ఎవరూ ఇంట్లో ఉండదు. పగలంతా బయట తిరిగి, రాత్రి సమయానికి ఇల్లు చేరుతారు. ఈ ఆచారం తెలుగునాట కొన్ని ఊర్లలో మాత్రమే కనబడుతుంది.
సంక్రాంతి సంబరాలు.ఇలా..!
సంక్రాంతికి తెలుగు వాళ్లు కోళ్లతో పందేలు వేసి సంబరాలు చేస్తారు. మకర సంక్రాంతిని తెలుగు వాళ్లు సంక్రాంతి అని, తమిళనాడు లో 'పొంగల్' అని, బెంగాల్ లో తిల ప్రా "సంక్రాంతి అని, పంజాబ్ లో 'లోహిడి' అని, మహారాష్ట్రలో 'సిటీ' సంక్రాతి అది వివిధ ప్రాంతాలలో వివిధ పేర్లతో పిలుస్తారు. కొన్ని ప్రాం తాలలో ఎడ్ల పందేలు జరుపుతారు. మరికొన్ని ప్రాంతాలలో ఈ రోజున పితృదేవతల పేరిట వస్త్రదానం చేస్తారు.
