
- 12 రోజుల్లో 30 లక్షల మంది వచ్చారు : మంత్రి శ్రీధర్బాబు
జయశంకర్భూపాలపల్లి/మహదేవపూర్, వెలుగు : కాళేశ్వరంలో ఈ నెల 15న మొదలైన సరస్వతీ పుష్కరాలు సోమవారంతో ముగిశాయి. చివరి రోజు కావడంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరించారు. అనంతరం ముక్తీశ్వరుడిని దర్శించుకున్నారు. చివరిరోజున ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, స్పెషల్ సీఎస్ వికాస్రాజ్ దంపతులు పుష్కర స్నానం చేశారు. పుష్కరాల ముగింపు సందర్భంగా రాత్రి త్రివేణి సంగమ ఘాట్ వద్ద డ్రోన్షో ఏర్పాటు చేశారు. పుష్కరాల సందర్భంగా 12 రోజులపాటు నిర్వహించిన హోమాలు సోమవారం పూర్ణాహుతితో ముగిశాయి. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, డైరెక్టర్ వెంకట్రావు, ఈవో మహేశ్ పాల్గొన్నారు.
పుష్కరాలకు 30 లక్షల మంది వచ్చారు : మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు
‘కాళేశ్వరంలో జరిగిన సరస్వతీ పుష్కరాలకు సుమారు 30 లక్షల మంది భక్తులు వచ్చారు.. ఛాలెంజ్గా తీసుకొని పుష్కరాలను విజయవంతం చేశాం’ అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు చెప్పారు. సోమవారం సాయంత్రం సరస్వతి ఘాట్వద్ద జరిగిన నవరత్నమాలా హారతి కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. అనంతరం జరిగిన పుష్కరాల ముగింపు సమావేశంలో మంత్రి మాట్లాడారు. పుష్కరాల కోసం రూ. 40 కోట్లతో ఏర్పాట్లు చేశామని చెప్పారు. వర్షం వల్ల ఇబ్బందులు ఏర్పడినా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసిన జిల్లా యంత్రాగాన్ని అభినందించారు.
రాబోయే గోదావరి పుష్కరాలను మరింత వైభవంగా నిర్వహిస్తామని చెప్పారు. చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు మాట్లాడుతూ దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ ప్రత్యేక చొరవతో, ఆఫీసర్లకు సూచనలు జారీ చేస్తూ పుష్కరాలను సక్సెస్ చేశారని కొనియాడారు. కార్యక్రమంలో నాగఫణిశర్మ, ఆర్అండ్బీ ప్రత్యేక కార్యదర్శి వికాస్రాజ్, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్కుమార్, ఎమ్మెల్యేలు గండ్ర సత్యనారాయణరావు, మదన్మోహన్, మక్కాన్సింగ్, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ ఐతా ప్రకాశ్రెడ్డి, కలెక్టర్ రాహుల్శర్మ, ఎస్పీ కిరణ్ఖరే పాల్గొన్నారు