- సైన్స్ సెమినార్లో ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ రమేశ్
హైదరాబాద్, వెలుగు: టీచర్లు విద్యార్థులకు ప్రశ్నించేతత్వాన్ని నేర్పించాలని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి.రమేశ్ సూచించారు. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాద్లోని ఎస్సీఈఆర్టీ ఆఫీస్లో డెవలపింగ్ సైంటిఫిక్ టెంపర్ అండ్ క్రిటికల్ థింకింగ్ అనే అంశంపై రాష్ట్రస్థాయి సైన్స్ సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సైన్స్ అంటే కేవలం పుస్తకాల్లో ఉన్నది చదవడం కాదని.. ల్యాబ్ మాన్యువల్స్ ఉపయోగించి ప్రాక్టికల్ గా నేర్పించినప్పుడే విద్యార్థులకు సబ్జెక్టుపై పట్టు వస్తుందని చెప్పారు.
అనంతరం సెమినార్ పేపర్లతో రూపొందించిన సైన్స్ కాంపెండియం పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఇది సైన్స్ టీచర్లకు ఉపయోగపడుతుందని తెలిపారు. సెమినార్ కు రాష్ట్రవ్యాప్తంగా టీచర్ల నుంచి ఇంగ్లిష్, తెలుగు మీడియంలో 99, ఉర్దూలో 6 పేపర్లు వచ్చాయి. జ్యూరీ సభ్యులైన ఓయూ ప్రొఫెసర్లు నాగేశ్వర్ రావు, విజయభాస్కర్ రెడ్డి ఇంగ్లిష్, తెలుగులో 30, ఉర్దూలో 2 పేపర్లను ఎంపిక చేయగా.. టీచర్లు, టీచర్ఎడ్యుకేటర్లు వాటిని ప్రజెంట్చేశారు.
