
ఎల్లారెడ్డిపేట, వెలుగు: స్కూల్ కు వెళ్లిన బాలుడు తిరిగి ఇంటికి వెళ్లని ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగింది. ఎస్ఐ రమాకాంత్ తెలిపిన ప్రకారం.. ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కిషన్ దాస్ పేటకు చెందిన మహమ్మద్ జఖియా కొడుకు తాజుద్దీన్ (8) స్థానిక ప్రైమరీ స్కూల్ లో 3 వ తరగతి చదువుతున్నాడు.
సోమవారం ఉదయం తాజుద్దీన్ స్కూల్ కు వెళ్లాడు. సాయంత్రం ఇంటికి తిరిగి రాకపోవడంతో తల్లి స్థానికంగా వాకబు చేసింది. అనంతరం స్కూల్ హెచ్ఎం కు ఫోన్ చేసి అడగగా స్కూల్ ముగిశాక ఇంటికి పంపించామని తెలిపారు. దీంతో భయాందోళన చెందిన జఖియా పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.