మాతృభాషలో పాఠశాల విద్య ఉత్తమం : సీహెచ్‌‌‌‌ విద్యాసాగర్‌‌‌‌ రావు

మాతృభాషలో పాఠశాల విద్య ఉత్తమం : సీహెచ్‌‌‌‌ విద్యాసాగర్‌‌‌‌ రావు

హైదరాబాద్, వెలుగు : మాతృభాషలో పాఠశాల విద్యను అభ్యసిస్తే విద్యార్థుల మేధస్సుకు గట్టి పునాదులు ఏర్పడతాయని మాజీ గవర్నర్‌‌‌‌ చెన్నమనేని విద్యాసాగర్‌‌‌‌ రావు పేర్కొన్నారు. బుధవారం హైదరాబాద్​లో  నిర్వహించిన సాహిత్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విశ్రాంత ప్రధానాచార్యుడు కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి రచించిన ‘మధుపాళీ వ్యాసతోరణం’ పుస్తకం ఆవిష్కరించి మాట్లాడారు. నేటి డిజిటల్‌‌‌‌ యుగంలో ఆంగ్ల విద్యకు తల్లిదండ్రులు, సమాజం అధిక ప్రాధాన్యం ఇస్తుండగా, చిన్నారులు సంస్కృతి, వారసత్వాలకు దూరమవుతు పాశ్చాత్య సంస్కృతికి ఆకర్షితులవుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.

యువతను సన్మార్గంలో నడిపించడానికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సాహితీవేత్తలు తమ పాత్రలను సమర్థవంతంగా నిర్వర్తించాలని సూచించారు. కెమిస్ట్రీ ఆచార్యుడు, ప్రిన్సిపల్‌‌‌‌, పాఠ్యపుస్తక రచయిత, కాలమిస్టు, వ్యక్తిత్వ వికాస నిపుణులు, కవి, సంఘ సేవకుడు అయిన బుర్ర మధుసూదన్ రెడ్డిని ఆయన అభినందించారు. ఈ సమావేశానికి దాస్యం సేనాధిపతి అధ్యక్షత వహించగా..  విశిష్ట అతిథి నేటి నిజం సంపాదకుడు బైసా దేవదాసు, గౌరవ అతిథి శాతవాహన టైమ్స్ సంపాదకుడు అనుముల దయాకర్‌‌‌‌, కరీంనగర్‌‌‌‌ ఫిలిమ్‌‌‌‌ సొసైటీ అధ్యక్షుడు, కవి, సినీ రచయిత పొన్నం రవిచంద్ర హాజరై మాట్లాడారు. ​