
సికింద్రాబాద్, వెలుగు: ‘తెలంగాణ స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్–2023’లో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వే 5 అవార్డులను దక్కించుకుంది. అదే విధంగా ‘ఆంధ్రప్రదేశ్ స్టేట్ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డ్స్– 2023’లో భాగంగా సౌత్ సెంట్రల్ రైల్వేకు 2 అవార్డులు దక్కాయి. బుధవారం ఖైరతాబాద్లోని విశ్వేశ్వరయ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం నుంచి, విజయవాడలోని వివంతా హోటల్లో జరిగిన కార్యక్రమంలో ఏపీ ప్రభుత్వం నుంచి రైల్వే అధికారులు ఈ అవార్డులను అందుకున్నారు. రైల్వే స్టేషన్ భవనాల విభాగంలో నల్గొండ రైల్వేస్టేషన్కు గోల్డ్ అవార్డు, ప్రభుత్వ భవనాల విభాగంలో లేఖా భవన్కు గోల్డ్, రైల్వే స్టేషన్ భవనాల విభాగంలో కాచిగూడకు సిల్వర్, ప్రభుత్వ భవనాల విభాగంలో హైదరాబాద్లోని ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ భవనానికి సిల్వర్, లాలాగూడలోని వర్క్షాపునకు సిల్వర్ అవార్డులు దక్కాయి. ఈ సందర్భంగా సౌత్ సెంట్రల్ రైల్వే మేనేజర్ అరుణ్కుమార్ జైన్ ఆయా డివిజన్లకు చెందిన రైల్వే మేనేజర్లు, సిబ్బంది అభినందించారు.