
హైదరాబాద్, వెలుగు: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజే పీ తరఫున పోటీ చేసేందుకు అశావహుల నుంచి వచ్చిన అప్లికేషన్ల పరిశీలనకు రాష్ట్ర పార్టీ నేతలు సిద్ధమయ్యారు. ఈ నెల 4 నుంచి 10 వరకు స్వీకరించిన 6వేలకు పైగా అప్లికేషన్లను నియోజకవర్గాల వారీగా వేరుచేసే ప్రక్రియ గురువారంతో పూర్తయ్యింది. ఇక వీటిని స్క్రీనింగ్ చేసే ప్రక్రియ త్వరలో ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గానికి 67 దరఖాస్తులు, ముషీరాబాద్కు 50కి పైగా వచ్చినట్లు సమాచారం. అతి తక్కువగా నర్సాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాలకు వచ్చినట్లు తెలిసింది. కల్వకుర్తికి 3, నర్సాపూర్ కు 4 మాత్రమే దరఖాస్తులు అందినట్లు తెలుస్తున్నది. అప్లికేషన్ల స్క్రీనింగ్ ప్రక్రియకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సుమారు15 మందితో రాష్ట్ర ఎన్నికల కమిటీని నియమించనున్నట్లు చర్చ సాగుతున్నది. ఈ కమిటీనే స్క్రీనింగ్ తర్వాత నియోజకవర్గానికి ముగ్గురిని చొప్పున ఫైనల్ చేయనుంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నాయకత్వంలో ఏర్పాటు కానున్న కమిటీలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఉండనున్నారు.