- రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర మున్సిపల్ శాఖలో ఖాళీగా ఉన్న ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య ఆదేశించారు. శుక్రవారం బేగంపేటలోని టూరిజం ప్లాజాలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులపై సమీక్ష నిర్వహించారు. పెండింగ్ కారుణ్య నియామకాలను పూర్తి చేయాలని, శాఖలో ఉన్న ఖాళీల వివరాలను మహిళా రిజర్వేషన్లతో సహా కమిషన్కు అందజేయాలని సూచించారు.
అవుట్ సోర్సింగ్ సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించడంతో పాటు ఈఎస్ఐ, ఈపీఎఫ్ బకాయిలను క్లియర్ చేయాలన్నారు. పారిశుధ్య కార్మికులకు బీమా సౌకర్యం కల్పించాలని, 60 ఏళ్లు పైబడిన వారి స్థానంలో అర్హులైన కుటుంబ సభ్యులకు అవకాశం కల్పించాలన్నారు. కమిషన్ సభ్యులు లక్ష్మీనారాయణ, శంకర్, ప్రవీణ్, లావణ్య, డిప్యూటీ డైరెక్టర్ చరణ్ దాస్, సీడీఎంఏ ఆఫీసర్లు పాల్గొన్నారు.

