- ఈ ఏడాది ఏప్రిల్–జులై మధ్య భారీగా అనుమతులిచ్చిన మార్కెట్ రెగ్యులేటరీ
- అయినా ఐపీఓకి వచ్చిన కంపెనీలు తక్కువే
న్యూఢిల్లీ: ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ) కి వచ్చేందుకు ఈ ఏడాది ఏప్రిల్–జులై మధ్య సుమారు 28 కంపెనీలకు సెబీ అనుమతిచ్చింది. ఈ కంపెనీలు ప్రైమరీ మార్కెట్ (ఐపీఓ) ద్వారా రూ. 45 వేల కోట్లు సేకరిస్తాయని అంచనా. ఇప్పటికే 11 కంపెనీలు ఈ ఏడాది ఏప్రిల్–మే మధ్య ఐపీఓకి రాగా, రూ. 33,000 కోట్లను సేకరించగలిగాయి. ఇందులో రూ. 20 వేల కోట్లు ఒక్క ఎల్ఐసీనే సేకరించింది. ఈ ఏడాది మే తర్వాత ఐపీఓలు లేకపోవడాన్ని గమనించొచ్చు. దీనిని బట్టి ప్రైమరీ మార్కెట్ మే తర్వాత డల్గా మారిందని తెలుస్తోంది.
జొమాటో, పేటీఎం, నైకా వంటి కొత్త తరం టెక్నాలజీ కంపెనీల షేర్లు ఈ ఏడాది భారీగా పతనమైన విషయం తెలిసిందే. దీంతో ఐపీఓలకి రావడానికి కంపెనీలు వెనకడుగేస్తున్నాయి. గ్లోబల్ కారణాలతో పాటు లోకల్ మార్కెట్ నుంచి విదేశీ ఇన్వెస్టర్లు వెళ్లిపోవడం కూడా ప్రైమరీ మార్కెట్లో డిమాండ్ తగ్గడానికి ఒక కారణం.
వేచి చూస్తున్నాయి..
లైఫ్స్టైల్ బ్రాండ్ ఫాబ్ ఇండియా, ఫాక్స్కాన్ సబ్సిడరీ కంపెనీ భారత్ ఎఫ్ఐహెచ్, టీవీఎస్ సప్లయ్ చెయిన్ సొల్యూషన్స్, బ్లాక్స్టోన్కు వాటాలు ఉన్న ఆధార్ హౌసింగ్ ఫైనాన్స్, మెక్లియోడ్స్ ఫార్మాస్యూటికల్స్, క్లౌడ్నైన్ పేరుతో సూపర్ స్పెషాలిటీ చెయిన్ను ఆపరేట్ చేస్తున్న కిడ్స్ క్లినిక్ ఇండియా కంపెనీలు ఐపీఓకి రావడానికి సెబీ నుంచి అనుమతులు పొందాయి. ఈ కంపెనీలు ఇంకా తమ ఐపీఓ డేట్ను ప్రకటించలేదు. మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా మారకపోవడంతో ఈ కంపెనీలు వేచి చూసే ధోరణిని అనుసరిస్తున్నాయని ఎనలిస్టలు చెబుతున్నారు. ‘ప్రస్తుతం మార్కెట్ పరిస్థితులు క్లిష్టంగా ఉన్నాయి. దీంతో ఇప్పటికే అనుమతులు పొందిన కంపెనీలు కూడా ఐపీఓకి రావడానికి వేచి చూస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే ఈ కంపెనీలు ఇప్పటికే తమ ఐపీఓ రోడ్షోలను పూర్తి చేశాయి’ అని ఆనంద్ రాఠీ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఎనలిస్ట్ ప్రశాంత్ రావు అన్నారు.
చివరి ఆరు నెలల్లో ఉండొచ్చు..
2021–22 ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 52 కంపెనీలు ఐపీఓకి వచ్చాయి. సుమారు రూ. 1.11 లక్షల కోట్లను సేకరించాయి. ఈ టైమ్లో ఐపీఓ మార్కెట్కు ఫుల్ డిమాండ్ క్రియేట్ అయ్యింది. భారీగా లిస్టింగ్ గెయిన్స్ రావడంతో ప్రతి ఐపీఓలోనూ రిటైల్ ఇన్వెస్టర్ల పార్టిసిపేషన్ బాగా కనిపించింది. కానీ, ప్రస్తుతం ఈ పరిస్థితుల్లో మార్పొచ్చింది. దీనికి స్టాక్ మార్కెట్లు నష్టపోవడం ఒక కారణం కాగా, పేటీఎం, జొమాటో షేర్లు పతనం, ఎల్ఐసీ షేరు నష్టాల్లో లిస్టింగ్ అవ్వడం మరో కారణమని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎనలిస్ట్ వీకే విజయకుమార్ అన్నారు. మార్కెట్లు కనిష్టాల నుంచి రికవరీ అయ్యాయని, కొన్ని కంపెనీలు మార్కెట్లోకి రావడానికి ప్రయత్నించొచ్చని మోతీలాల్ ఓస్వాల్ సీఈఓ అభిజిత్ తారే అన్నారు.
రానున్న 2–3 నెలల్లో కొన్ని కంపెనీలైనా ఐపీఓకి రావడం చూస్తామని అంచనా వేశారు. ‘కంపెనీల క్వార్టర్లీ రిజల్ట్స్ బాగుండడం, ఎకనామిక్ ఇండికేటర్లు మెరుగ్గా ఉండడంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి ఆరు నెలల్లో కొన్ని ఐపీఓలైనా ఉంటాయని అంచనా వేస్తున్నాం. క్వాలిటీ కంపెనీలు రీజనబుల్ ధరలోనే మార్కెట్లోకి ఎంటర్ అవ్వడానికి ప్రయత్నించొచ్చు’ అని ఎనలిస్టులు చెబుతున్నారు. ఇప్పటికే చాలా కంపెనీలు తమ ఐపీఓ ప్రిలిమినరీ పేపర్లను సెబీ వద్ద సబ్మిట్ చేశాయి. ఈ ఏడాది జూన్–జులై మధ్య మొత్తం 15 కంపెనీలు తమ ఐపీఓ ప్రిలిమినరీ పేపర్లను సబ్మిట్ చేశాయి. ఇందులో సులా వైన్యార్డ్స్, అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలరీస్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, సాయి సిల్క్ కళామందిర్ కంపెనీలు ఉన్నాయి.