SEBI News: బాలీవుడ్ నటుడిపై సెబీ బ్యాన్.. 57 సంస్థలపై నిషేధం..

SEBI News: బాలీవుడ్ నటుడిపై సెబీ బ్యాన్.. 57 సంస్థలపై నిషేధం..

SEBI Ban: స్టాక్ మార్కెట్లలో జరిగే మోసాలను అరికట్టడంతో పాటు ఇన్వెస్టర్లకు రక్షణ కల్పించటంపై సెక్యూరిటీస్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటుంది. ఈ క్రమంలోనే రెగ్యులేటరీ సంస్థ బాలీవుడ్ నటుడు అర్షద్ వర్సీ, అతని భార్య మరియా గొర్రెటి సహా 57 సంస్థలను స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ కార్యకలాపాలు చేయకుండా అడ్డుకుంది. వీరిపై ఈ నిషేధం రానున్న 5 ఏళ్ల పాటు కొనసాగుతుందని సెబీ స్పష్టం చేసింది.

తాజాగా సెబీ దాఖలు చేసిన 109 పేజీల రిపోర్టులో వీరిపై అభియోగాలు మోపింది. ఈ క్రమంలో సంధ్యా బ్రాడ్ క్యాస్టింగ్ సహా నింధితులపై రూ.5 లక్షల నుంచి రూ.5 కోట్ల వరకు జరిమానాలు విధిస్తున్నట్లు పేర్కొంది. వీరు తమ జరిమానాలను చెల్లించే రోజు వరకు దానిపై 12 శాతం చొప్పున వడ్డీ కూడా కట్టాల్సి ఉంటుందని వెల్లడించింది. నిందితులు చేసిన అక్రమాలతో నటుడు అర్షద్ రూ.41 లక్షల 70వేలు సంపాదించగా.. అతని భార్య రూ.50 లక్షల 35వేలు లాభపడినట్లు దర్యాప్తులో గుర్తించారు. 

Also Read : షాకింగ్.. చిరిగిన నోట్లను ఆర్బీఐ ఏం చేస్తుందో తెలుసా..?

నిందితులు యూట్యూబ్ ద్వారా పంప్ అండ్ డంప్ స్కామ్ కి పాల్పడినట్లు సెబీ వెల్లడించింది. నిందితులు సంధ్యా బ్రాడ్ కాస్టింగ్ షేర్లకు కృత్రిమంగా డిమాండ్ సృష్టించారు. ప్రజలు వీటిని కొనుగోలు చేసేలా చేసేందుకు మనీ వైజ్, ది అడ్వైజర్, ప్రాఫిట్ యంత్ర వంటి యూట్యూబ్ చానళ్ల ద్వారా ఇన్వెస్టర్లకు భారీ లాభాలు వస్తాయంటూ గ్యాలం వేసినట్లు తేలింది. మెుత్తానికి ఈ వ్యవహారంలో గౌరవ్ గుప్తా, రాకేష్ కుమార్ గుప్తా, మనీష్ మిశ్రాలు కీలక సూత్రదారులుగా ఉన్నారని వెల్లడైంది.