బాబా రాందేవ్ కు సెబీ చీవాట్లు

బాబా రాందేవ్ కు సెబీ చీవాట్లు

ముంబయి: ఇన్వెస్టర్లకు కొన్ని తప్పుడు హామీలు ఇచ్చినందుకు స్టాక్ ఎక్చేంజ్ బోర్డు (సెబీ) చీవాట్లు పెట్టింది. రాందేవ్ సంస్థ తయారీ రుచి సోయా ఫాలో ఆన్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఎఫ్‌పీఓ)కు కొన్ని రోజుల్లో ప్రారంభం కానున్న  నేపథ్యంలో ఓ వీడియో ద్వారా ఇన్వెస్టర్లకు కొన్ని తప్పుడు ఇన్వెస్ట్ మెంట్ హామీలిచ్చారని తప్పుపట్టింది. సదరు వీడియోలో బాబా రామ్‌దేవ్ తన అనుచరులను ఉద్దేశించి మాట్లాడుతూ ‘కోటీశ్వరుడు కావడానికి నేను నీకు మంత్రాన్ని ఇస్తున్నా.. ఈరోజే డీమ్యాట్ ఖాతాను తెరవండి... నేను మీకు చెప్పినప్పుడు రుచి సోయా షేర్లను కొనండి... ఆ తర్వాత పతంజలి షేర్లు... దీని మార్కెట్ క్యాప్ లక్షల కోట్లు ఉందనే విషయాన్ని ఏదైనా గ్లోబల్ ఏజెన్సీ మీకు తెలియజేస్తుంది’ అని అన్నారు. 
హిందీలో రూపొందించిన ఈ వీడియోపై మార్కెట్ వర్గాల్లో అభ్యంతరాలు వచ్చాయి. నిధుల సేకరణ కోసం పబ్లిక్ ఆఫర్ కు వెళ్తున్న ఈ కంపెనీ తరపున మీరు కోటీశ్వరులు కావాలనుకుంటే రుచి సోయా ఇండస్ట్రీస్ షేర్లను కొనండి అని బాబా రాందేవ్  సలహా ఇవ్వడం అంటే ఇన్వెస్టర్లకు తప్పుడు హామీలు ఇవ్వడమేనని స్టాక్ ఎక్చేంజ్ బోర్డు ( సెబీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. మార్కెట్లో రూ. 4,500 కోట్ల నిధుల సేకరణకు సిద్ధమవుతున్న తరుణంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై సెబీ చీవాట్లు పెడుతూ రుచి సోయా బోర్డుకు లేఖ పంపింది.