
న్యూఢిల్లీ: మైండ్ట్రీని ఎల్ అండ్ టీ కొనడానికి ముందు భారీ డివిడెండ్ ఎందుకు ప్రకటించాల్సి వచ్చిందో చెప్పాలని సెబీ బెంగళూరుకు చెందిన ఈ మధ్యస్థాయి ఐటీ సేవల కంపెనీని ఆదేశించింది. గత నెల వార్షిక ఫలితాలు ప్రకటించిన మైండ్ట్రీ, రూ.10 ముఖ విలువ కలిగిన షేరుకు 270 శాతం చొప్పున డివిడెండ్ ప్రకటించింది. 200 శాతం స్పెషల్ డివిడెండ్ దీనికి అదనం. 2019 ఆర్థిక సంవత్సరానికి 40 శాతం తుది డివిడెండ్, 30 శాతం మధ్యంతర డివిడెండ్ ప్రకటించింది. కంపెనీ రెండు దశాబ్దాల చరిత్రలో ఇంత భారీగా డివిడెండ్ ప్యాకేజీ ఇవ్వడం ఇదే తొలిసారి. ఫలితంగా ప్రమోటర్లు తమ వాటా 13.32 శాతానికిగానూ రూ.60 కోట్లు పొందుతారు. దీనిపై స్పందించిన సెబీ డివిడెండ్ చెల్లింపు విధానాన్ని వెల్లడించాలని గత నెల మూడోవారంలో మైండ్ట్రీకి లేఖ రాసింది. మైండ్ట్రీలో 25.93 శాతం వాటాను కొనే ప్రక్రియను ఎల్ అండ్ టీ గురువారమే పూర్తి చేసింది.
రూ.10,700 కోట్లు వెచ్చించిన ఎల్ అండ్ టీ
మైండ్ట్రీ వాటాదారు, కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ నుంచి 20.32 శాతం, ఓపెన్ మార్కెట్ ద్వారా 15 శాతం, ఓపెన్ ఆఫర్ ద్వారా 31 శాతం వాటాలు కొంటామని ఎల్ అండ్ టీ ఈ ఏడాది మార్చి 18న ప్రకటించింది. ఈ లెక్కన ఎల్ అండ్ టీ మైండ్ట్రీలో 66.32 శాతం వాటా కొనడానికి రూ.10,700 కోట్లు చెల్లించాలి. మనదేశ ఐటీ చరిత్రలో తొలి బలవంతపు విలీనం ఇదే అవుతుంది. మైండ్ట్రీ ప్రమోటర్లు మొదటి నుంచి ఎల్ అండ్ టీ తమ కంపెనీలో మెజారిటీ వాటాలు దక్కించుకోవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు