
హైదరాబాద్, వెలుగు: ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెంట బీఆర్ఎస్ క్యాడర్ వెళ్లకుండా ఎలా కట్టడి చేయాలనే దానిపై గులాబీ పార్టీ తంటాలు పడుతున్నది. సోమవారం హైదరాబాద్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నేతలు భేటీ అయి.. పొంగులేటి వెంట ఎవరెవరు ఉన్నారు? వారిని తిరిగి పార్టీలోకి ఎలా తేవాలి? అన్నదానిపై చర్చించారు. మంత్రి పువ్వాడ అజయ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ భేటీలో.. ఎంపీలు నామా నాగేశ్వర్ రావు, వద్దిరాజు రవిచంద్ర సహా పలువురు నేతలు పాల్గొన్నారు.
అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వర్ రావు, భద్రాద్రి కొత్తగూడెం జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య ఈ మీటింగ్కు హాజరుకాలేదు. కనకయ్య మొదటి నుంచి పొంగులేటి వెంటే ఉండగా.. నాగేశ్వర్ రావు డుమ్మా కొట్టడంపై చర్చ జరుగుతున్నది. రాజ్యసభ సభ్యుడు పార్థసారథి రెడ్డి అటెండ్ కావాల్సి ఉన్నా.. ఇతర కారణాలతోనే రాలేదని తెలిసింది. ఉమ్మడి ఖమ్మంలోని బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల్లో ఎక్కువ మంది పొంగులేటి వెంటే ఉన్నారు. వారిని దారిలోకి తెచ్చేందుకు చేస్తున్న ప్రయత్నాలేవి ఫలితాన్ని ఇవ్వలేదు. ఈ మీటింగ్ పై మంత్రులు కేటీఆర్, హరీశ్రావులకు పువ్వాడ రిపోర్టు ఇచ్చినట్లు సమాచారం.