స్కూల్​ నుంచి సస్పెండ్ చేశారని..టెన్త్ స్టూడెంట్ ఆత్మహత్య

స్కూల్​ నుంచి సస్పెండ్ చేశారని..టెన్త్ స్టూడెంట్ ఆత్మహత్య

సికింద్రాబాద్​, వెలుగు: స్కూల్​కు సెల్​ఫోన్​ తీసుకెళ్లినందుకు పాఠశాల యాజమాన్యం సస్పెండ్​ చేయడంతో మనస్తాపం చెందిన టెన్త్​ క్లాస్​ స్టూడెంట్​  రైలు కిందపడి సూసైడ్​ చేసుకున్నాడు. సోమవారం సికింద్రాబాద్ పరిధిలోని ఆర్కేపురంలో ఈ విషాదం జరిగిందని రైల్వే పోలీసులు వివరాలు వెల్లడించారు. గాంధీనగర్​లో ఉంటున్న రిటైర్డ్ ​ఆర్మీ ఉద్యోగి రమణారెడ్డి కొడుకు దినేశ్​​రెడ్డి(15) ఏవోసీ సెంటర్​లోని ఆర్మీ స్కూల్​లో టెన్త్​ క్లాస్​ చదువుతున్నాడు. దినేశ్ సోమవారం స్కూల్​కు సెల్​ఫోన్​ తీసుకువెళ్లగా.. అది గమనించి క్లాస్​ టీచర్​ వైస్​ ప్రిన్సిపాల్​కు ఫిర్యాదు చేశారు. ఆయన ఈ విషయాన్ని ప్రిన్సిపాల్​కు చేరవేశారు. దీంతో ఆ ప్రిన్సిపాల్ దినేశ్​ రెడ్డి తండ్రిని స్కూల్​కు పిలిపించుకుని మందలించారు.

క్రమశిక్షణ ఉల్లంఘించడంతో దినేశ్​ను 12 రోజుల పాటు సస్పెండ్​ చేశారు. దీంతో తండ్రీకొడుకులు ఇద్దరూ స్కూల్​ నుంచి బయటికి వచ్చారు. తనకు అర్జంట్ పనుందని..  దినేశ్​ను ఇంటికి వెళ్లమని చెప్పి రమణారెడ్డి వెళ్లిపోయాడు. తన సైకిల్​పై ఇంటికి బయల్దేరిన దినేశ్.. సస్పెండ్​ చేయడాన్ని తట్టుకోలేకపోయాడు. అమ్ముగూడ రైల్వేస్టేషన్​కు చేరుకుని పట్టాల పక్కన తన సైకిల్​ను పడేసి.. ఎదురుగా వస్తున్న రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసులు కేసు  నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.